ఏప్రిల్ నెల మూడవ తేదీ సోమవారం నుండి జరగబోవు పదవ తరగతి పరీక్షలలో మాల్ ప్రాక్టీస్ కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్ ఐ ఎల్ సంపత్ కుమార్ తెలిపారు. ఆదివారం ముండ్లమూరులో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, ఆదర్శ పాఠశాలలో, ఈ మూడు కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయని, జిల్లా ఎస్పీ మల్లికాగర్గ్ ఆదేశాల మేరకు మూడు కేంద్రాల ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పరీక్షా కేంద్రాల ఆవరణలో ప్రభుత్వం నిబంధనలను అతిక్రమిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు. విద్యార్థిని విద్యార్థులు ఉదయం 9:30 గంటలకు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదన్నారు. పరీక్ష కేంద్రాలకు ఎలాంటి స్మార్ట్ వాచ్, మొబైల్ ఫోన్, ఐప్యాడ్, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఇన్విజిలేటర్లు, కేటాయించిన ఉపాధ్యాయ సిబ్బంది మాత్రమే ఉండాలన్నారు. మూడో తేదీ సోమవారం నుండి ఈనెల 18వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని, పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉందని, జిరాక్స్ సెంటర్లో మూసివేయాలని, పరీక్షల సమయంలో పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎల్ సుజాత, ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ కే పూర్ణచంద్రరావు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ప్రిన్సిపాల్ ఏ సునీత, లతో సమావేశం నిర్వహించి పరీక్షల రూములను పరిశీలించారు.



