ప్రజల ఆర్థిక అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ప్రజల పూర్తి స్థాయిలో మద్దతు తెలిపి పది కాలాల పాటు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. కొత్తపాలెం, మాధవరం గ్రామాలలలో శుక్రవారం రాత్రి గుంటి గంగా భవాని తిరునాళ్ల సందర్భంగా మందిరాల సంబరాలు నిర్వహించారు. సంబరాలలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ పాల్గొని మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు మ్యానిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయక అన్ని వర్గాలను మోసం చేసారని అన్నారు. నేడు సీఎం వైఎస్ జగనన్న మ్యానిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు తూచ తప్పకుండా అమలు చేస్తున్న విషయాన్ని వివరించారు. బీసీలను సముచిత స్థానం వైఎస్సార్సీపీలోనే దక్కిందని, కేవలం ప్రతిపక్షాలు ఓటు బ్యాంకుగానే బీసీలను చూస్తే రాజ్యాధికారం పంచినది వైఎస్సార్సీపీనే అని అన్నారు. రాష్ట్రంలో బిసి రజకకు చెందిన ఎంపీపీని తాళ్లూరు మండలానికి చెందిన తాటికొండ శ్రీనివాసరావుకు దక్కటం గర్వకారణమని అన్నారు. జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావులు నిత్యం మండలంలో అభివృద్ధి పనుల, ప్రజల అవసరాల కోసం పోరాటం చేయటం అభినందనీయమన్నారు.
అనంతరం ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, వైస్ ఎంపీపీలు ఐ. వెంకటేశ్వర రెడ్డి, ఎంఎస్పీ నాగార్జున రెడ్డి, కోప్షన్మెంబర్ కరిముల్లా, జె సి ఎస్ కన్వీనర్ యాడిక శ్రీనివాస్ రెడ్డి , సర్పంచిలు మేకల చార్లెస్ సర్జన్, వలి, రేణుక, నుసుం చిన ఆంజనేయులు.. ఆయా ప్రభలనిర్వాహకులు ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాలు, వైఎస్సార్సీపీ నాయకుడు మద్దిశెట్టి రవీంద్రలను ఘనంగా సన్మానించారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించారు. శివరామపురంలో కూడ టిడిపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రభపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.




