భారతదేశంలో దళిత ప్రజల అభివృద్ధి కోసం కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని ఎస్ ఐ ఎల్. సంపత్ కుమార్ అన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో శుక్రవారం 132వ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సై ఎల్. సంపత్ కుమార్ మాట్లాడుతూ …. అంబేద్కర్ భారతదేశ దళితుల సంక్షేమం కోసం అధ్యయనంచేసి భారత రాజ్యాంగాన్ని రచించారన్నారు. జడ్పిటిసి తాతపూడి మోజేష్ రత్నం రాజు మాట్లాడుతూ బిఆర్ అంబేద్కర్ ఒక మతానికో,కులానికో చెందిన వ్యక్తి కాదని, ఆయన భారతదేశం గర్వించదగ్గ ఒక మహోన్నత వ్యక్తి అని అన్నారు. దాసరి ఏసుబాబు మాట్లాడుతూ మహిళలకు, పేదలకు, బడుగు వర్గాలకు, దళితులకు అనేక హక్కులు రాజ్యాంగంలో కల్పించిన మహానుభావుడు అని అన్నారు. ప్రధానోపాధ్యాయులు కేతావత్ పూర్ణచంద్రనాయక్ మాట్లాడుతూ 10 నెలల కాలంలో 16 వేల పుస్తకాలు చదివిన ఏకైక వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు. చిన్న వయసు నుండి ఎన్నో కష్టాలు పడి జవహర్లాల్ నెహ్రూ మంత్రివర్గంలో న్యాయశాఖ మంత్రిగా పనిచేశారన్నారు. బహుజన రిసోర్స్ సెంటర్ జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ దార్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా లింగ వివక్షతకు తావు లేకుండా రాజ్యాంగబద్ధంగా పౌరులందరికీ సమాన హక్కులు కల్పించిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు. ముందుగా అంబేద్కర్ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి పెద్ద ఎత్తున అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉలగల్లు సర్పంచి జనమాల నాగేంద్ర పిచ్చయ్య, సింగనపాలెం సర్పంచి కందిమల్ల గీతాంజలి. పసుపుగల్లు ఎంపీటీసీ దాసరి పెద్ద అంజయ్య. వేంపాడు సర్పంచి వద్దిపోగు గురవయ్య. గోపన బోయిన వెంకటరావు, బెంజిమెన్, సుబ్బయ్య, తదితరులు పాల్గొన్నారు.


