గడచిన రెండు రోజుల్లో రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో విధులను నిర్వహిస్తూ ముగ్గురు టీచర్ల ఆకస్మికంగా మరణించడం పట్ల విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విద్యార్ధులకు పాఠాలు చెపుతూ ఒకరు, పదో తరగతి పరీక్షా పత్రాల మూల్యాంకనం (స్పాట్ వాల్యూయేషన్) విధులను నిర్వహిస్తూ ఇద్దరు ఇలా రెండు రోజుల్లో ముగ్గురు టీచర్లు విధి నిర్వహణలో మరణించడం చాలా బాధాకరమని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శుక్రవారం నాడు పల్నాడు జిల్లాలో పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ విధులను నిర్వహిస్తూ జోజప్ప (స్పెషల్ అసిస్టెంట్), అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆకొండి బంగారయ్య అనే ఉపాధ్యాయుడు తరగతి గదిలోనే ఆకస్మికంగా మృతి చెందడం విచారకరమని అన్నారు. అలాగే గురువారం నాడు బాపట్లలో లెక్కల టీచర్ శ్రీనివాస రావు స్పాట్ వాల్యూయేషన్ విధుల్లో మరణించడం పట్ల మంత్రి విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియచేశారు.
రాష్ట్రంలో వేసవి ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో స్పాట్ వాల్యూయేషన్ కేంద్రాల్లోనూ, ఇతరత్రా విద్యా శాఖకు చెందిన అన్ని కార్యాలయాల్లో వేసవి ఎండలను తట్టుకునేలా తగిన మౌలిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశిస్తూ, ఉపాధ్యాయులు కూడా వ్యక్తిగతంగా తమ ఆరోగ్య విషయంలో తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
విధి నిర్వహణలో టీచర్ల ఆకస్మిక మరణం బాధాకరం –విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ• వేసవి దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోండి• స్పాట్ కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించండి …అధికారులకు ఆదేశం
21
Apr