ఏపీలో గ్యాస్ డెలివరీ ఛార్జీల ప్రకటన ! 5 కిలోమీటర్ల లోపు ఉచితం- ఆ తర్వాత ఛార్జీలివే..

ఏపీలో గ్యాస్ సిలెండర్ డెలివరీ ఛార్జీలపై విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇవాళ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వీటి ప్రకారం మొదటి ఐదు కిలోమీటర్ల వరకూ ఎలాంటి ఛార్జీలు వసూలు చేయరు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఏపీలో ఎల్పీజీ గ్యాస్ సిలెండర్ డెలివరీ ఛార్జీల వసూలు వ్యవహారంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్యాస్ డీలర్లు వినియోగదారుల్ని డెలివరీ ఛార్జీల పేరుతో దోచుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది.

ఏపీలో గ్యాస్ సిలెండర్ డెలివరీ పేరుతో జరుగుతున్న దోపిడీని అరికట్టేందుకు ప్రభుత్వం తాజాగా ఛార్జీల్ని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాలశాఖ కమిషనర్ ఇవాళ ఓ ప్రకటన విడుదల చేశారు. దీని ప్రకారం గ్యాస్ ఏజెన్సీ నుంచి ఐదు కిలోమీటర్ల దూరం వరకూ ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకూడదు. 5 కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్ల వరకూ దూరానికి కేవలం 20 రూపాయలు మాత్రమే ఛార్జీలు వసూలు చేయాలి. గ్యాస్ ఏజెన్సీ నుంచి 15 కిలోమీటర్లు దాటితే మాత్రం సిలెండర్ కు 30 రూపాయలు వసూలు చేసుకునే అవకాశం కల్పించారు.

సిలెండర్ డెలివరీ చేసే బాయ్ లు రవాణా పరిధిలో నివాసం ఉన్నా కూడా డెలివరీ కోసం అదనపు రుసుము వసూలు చేస్తున్నారని తరచూ ఫిర్యాదులు వస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. అందువల్ల సిలెండర్ డెలివరీ కోసం ప్రభుత్వం నిర్ణీత రుసుములు నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే వినియోగదారులకు ప్రత్యేక సూచనలు కూడా చేశారు.

వీటి ప్రకారం ఇకపై వినియోగదారులు సిలెండర్ రసీదులో ఉన్న రేటు మాత్రమే చెల్లించాలి. ఐదు కిలోమీటర్ల లోపు ఎలాంటి అదనపు మొత్తం చెల్లించాల్సిన అవసరం లేదని, ఆ పైన మాత్రం ప్రభుత్వం నిర్ణయించిన ఛార్జీలు చెల్లించాలని సూచించారు.

డెలివరీ బాయ్ ప్రభుత్వం అనుమతించిన దాని కంటే ఎక్కువ రుసుము వసూలు చేస్తే సంబంధించి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ డిస్ట్రిబ్యూటర్లు లేదా జిల్లా పౌరసరఫరాల అధికారి లేదా సేల్స్ అధికారికి తగు ఫిర్యాదు చేయవచ్చని కమిషనర్ సూచించారు. అలాగే ఎల్బీజీ వినియోగదారులు ఇవే అంశాలపై టోల్ ఫ్రీ ద్వారా 1967 ద్వారా ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్లోనూ ఫిర్యాదు చేయవచ్చన్నారు. అలాగే ఆయిల్ కంపెనీ టోల్ ఫ్రీ నంబర్ 1800233555కు కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. అలా వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *