అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవటమే ధ్యేయంగా క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్నట్లు ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, పంట నష్టం పరిశీలిన జిల్లా ప్రత్యేక అధికారి ఎం.టి క్రిష్ణబాబు తెలిపారు. తాళ్లూరు మండలంలో నాగం బొట్లపాలెం, తూర్పు గంగవరం పొలాల్లో క్షేత్ర స్ధాయిలో అకాల వర్షాలకు నష్టపోయిన పంటలను శనివారం జిల్లా కలెక్టర్ ఎ.ఎస్ దినేష్కుమార్తో కలిసి పరిశీలించారు. అనంతరం ఎన్బి పాలెం ఆర్టికేలో సర్పంచి సుబ్బారావు అధ్యక్షతన జరిగిన రైతుల సమావేశంలో ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.టి క్రిష్ణబాబు మాట్లాడుతూ… ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నష్టపోయిన ప్రతి రైతును ఆదుకునేందుకు క్షేత్ర స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అందులో బాగంగానే తాను క్షేత్ర స్థాయిలో పంటలను పరిశీలించటం జరిగిందని చెప్పారు. నువ్వు, ప్రత్తి, బత్తాయి, అరటి, జామ తోటలు దెబ్బతినటం గమనించామని చెప్పారు. అదే విధంగా రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించి వారిని ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి ఆడుకునేలా సీఎం ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. పంట నష్టంపై ప్రభుత్వం నుండి పూర్తి నివేదిక వచ్చిన తర్వాత మార్గదర్శకాల ప్రకారం పూర్తి నివేదిక సిద్ధం చేసి రైతులను ఆదుకుంటారని చెప్పారు. రైతులు ఆధైర్య పడవద్దని ధైర్యంగా ఉండాలని రైతులకు భరోసా ఇచ్చారు.
తూర్పుగంగవరం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిశీలన …… తూర్పుగంగవరం ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.టి క్రిష్ణబాబు తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలోను 105 రకాల మందులు ఉంచాలను అందుబాటులో ఉంచాలని 14 రకాల పరీక్షలు చేయ్యాలనేది ప్రభుత్వ లక్ష్యమని అందుకు అవసరమైన సిబ్బంది పూర్తి స్థాయిలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలో బాగంగా వైద్యులు ప్రతి గ్రామానికి వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితిని గమనించి వారికి అవసరమైన మందులు ఇవ్వటానికి డబ్ల్యుహెచ్ఓ ప్రామాణికంతో ఉన్న మందులను ప్రభుత్వం కొనుగోలు చేసి సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. మరింత మెరుగైన వైద్యం అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ వైద్యశాలకు సిఫార్స్ చేస్తున్నట్లు తెలిపారు. వైద్యశాలలో అందుతున్న సేవలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆయా కార్యక్రమాలలో వ్యవసాయాధికారి శ్రీనివాసరావు, ఆత్మ వీడి అన్నపూర్ణ, మార్క్ ఫెడ్ డీఎం హరిక్రిష్ణ, డీఎంహెచ్ రాజ్యలక్ష్మి, డీపీఓ నారాయణ రెడ్డి, మార్కెటింగ్ ఎడీ ఉపేంద్ర, పౌర సరఫరా సంస్థ డి. ఎం గ్లోరియా, జిల్లా ఉద్యానవనశాఖ అధికారి గోపి చంద్, ఆర్డీఓ విశ్వేశ్వరరావు, తహసీల్దార్ రామ్మోహన్రావు, పీహెచ్సీ వైద్యాధికారి బి. రత్నం, ఎంపీడీఓ శ్రీనివాసరావు. వ్యవసాయశాఖాధికారి ప్రసాదరావు, సొసైటీ చైర్మన్ శ్రీనివాస రెడ్డి, విజిలెన్స్ కమిటి మెంబర్ అనిల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




