ముండ్లమూరు మండలంలో జగనన్న కాలనీల ద్వారా ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు త్వరిత గతిన నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని హౌసింగ్ డిఇ నిరీక్షణ రావు అన్నారు. మండలంలోని నూజిలపల్లి గ్రామంలో సచివాలయం వద్ద శుక్రవారం హౌసింగ్ డే కార్యక్రమం ఆ గ్రామ సర్పంచ్ చొప్పరపు వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగినది. ఈ సందర్భంగా డిఇ నిరీక్షణ రావు మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకంలో ఇండ్లు మంజూరైన లబ్ధిదారు లకు నిర్మాణ స్థాయిని బట్టి బిల్లులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. గృహాలు మంజూరైన లబ్ధిదారులు తక్షణమే ఇండ్లు ప్రారంభించాలన్నారు. ఎవరికైనా బిల్లుల చెల్లింపులో జాప్యం జరిగితే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు స్వయం సహాయక సంఘాల గ్రూపులలో ఉన్నట్లయితే వారికి బ్యాంకుల ద్వారా 35 వేల నుండి 50 వేల వరకు రుణాలు అందించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇండ్లు మంజూరైన లబ్ధిదారులకు ఉపాధి హామీ పథకం ద్వారా 90 రోజులపాటు పని దినాలు కల్పించి వారికి నగదు చెల్లిస్తామన్నారు. కొత్తగా ఇల్లు నిర్మించుకునే వారు ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకుంటే ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ హనుమంతరావు, సచివాలయ సిబ్బంది, గృహ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

