వచ్చే ఏడాది రాష్ట్రంలో లోక్ సభ, శాసన సభ స్థానాలకు జరుగనున్న సాధారణ ఎన్నికలకు అవసరమైన తుది ఓటర్ల జాబితాను రూపొందించేందుకు ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యాచరణ ప్రణాళికను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మఖేష్ కుమార్ మీనా సోమవారం ప్రకటించారు. సోమవారం వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయం నాల్గో బ్లాక్ లోని పబ్లిసిటీ సెల్ లో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ వచ్చే ఏడాది జనవరి 1 నాటికి అర్హులైన ఓటర్లు అందరితో కలిపి తుది ఓటర్ల జాబితాను రూపొందించేందుకు ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమాన్ని నిర్వహించాలని భారత ఎన్నికల సంఘం నిర్ణయించినట్లు తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణకై ముందస్తు కార్యక్రమాలు మరియు సవరణ సమయంలోను రెండు రకాల కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ముందస్తు కార్యక్రమాల్లో భాగంగా ఇ.ఆర్.ఓ.లు, ఏ.ఇ.ఆర్.ఓ.లు, బి.ఎల్.ఓ.లకు అవసరమైన శిక్షణా కార్యక్రమాన్ని ఈ నెల 1 వ తేదీ నుండి ప్రారంభించడం జరిగిందని, ఆ కార్యక్రమం జూలై 20 వరకు కొనసాగుతుందన్నారు. అదే విధంగా జూలై 21 నుండి ఆగస్టు 21 వరకూ బి.ఎల్.ఓ.ల ఇంటింటి ఓటర్ల పరిశీలన కార్యక్రమాన్ని నిర్వహిస్తారన్నారు. ఆగస్టు 22 నుండి సెప్టెంబరు 29 వరకూ పోలింగ్ స్టేషన్ల క్రమబద్దీకరణ, పున:ఏర్పాట్లతో పాటు జనాబా, ఫొటోలు,ఎపిక్స్ లోని సారూప్య ఎంట్రీల తొలగింపు తదితర కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. సెప్టెంబరు 30 నుండి అక్టోబరు 16 వరకూ 1 నుండి 8 రకాల ఫార్మాట్లను రూపొందరిచడం జరుగుతుందన్నారు.
అదే విధంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ సమయంలో నిర్వహించే కార్యక్రమాల్లో భాగంగా అక్టోబరు 17 న సమగ్ర ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ, అక్టోబరు 17 నుండి నవంబరు 30 వరకూ క్లైమ్ లు మరియు అభ్యంతరాల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. శనివారం, ఆదివారం అయిన అక్టోబరు 28, 29 మరియు నవంబరు 18, 19 తేదీల్లో క్లైమ్ లు మరియు అభ్యంతరాల స్వీకరణకై బూత్ స్థాయిల్లో ప్రత్యేక క్యాంపులను నిర్వహించడం జరుగుతుందన్నారు. డిశంబరు 26 కల్లా క్లైమ్ లు మరియు అభ్యంతరాలను పరిష్కరించి, జనవరి 1 కల్లా తుది జాబితా ప్రచురణకు కమిషన్ అనుమతి పొందడం మరియు డాటా బేస్ నవీకరణ, సప్లమెంట్ ల ముద్రణ కార్యక్రమాలను పూర్తి చేయాల్సి ఉందన్నారు. అదే విధంగా జవనరి 5 న తుది ఓటర్ల జాబితాను ప్రచురించడం జరుగుతుందని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 1 కల్లా 18 సంవత్సరాలు నిండే యువత ఓటర్లుగా తమ పేరును నమోదు చేసుకోవచ్చని, అయితే తదుపరి మూడు మాసాల్లో మరో సప్లిమెంటరీ ఓటర్ల జాబితా రూపొందించడం జరుగుతుందని, మార్చి 1 నాటికి నూతనంగా అర్హులైన ఓటర్లు కూడా ఈ జాబితాలో తమ పేరును నమోదు చేయించుకోవచ్చని ఆయన తెలిపారు.
రాష్ట్రంలోనున్న 18-19 సంవత్సరాల యువ ఓటర్లలో జనాభా శాతం ప్రకారం 12 లక్షల యువ ఓటర్లు ఉండాలని, అయితే 3.50 లక్షల యువఓటర్లు మాత్రమే ఉన్నారని, ఈ వ్యత్యాసాన్ని పూరించాల్సి ఉందని ఆయన తెలిపారు. అదే విధంగా ప్రతి 1000 మంది జనాభాలో 714 ఓటర్లు ఉండటం ఆదర్శనీయమైన సంఖ్య అని అయితే మన రాష్ట్రంలో ఆ సంఖ్య కొంత ఎక్కువగా ఉందని, కొన్ని పోలింగ్ స్టేషన్ల పరిధిలో అయితే ఆ సంఖ్య 750 వరకూ ఉందన్నారు. అటు వంటి చోట్ల ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందన్నారు.
గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి….
ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమం విజయవంతంగా సాగేందుకు మరియు ఎటు వంటి లోపాలకు ఆస్కారం లేకుండా పటిష్టమైన తుది ఓటర్ల జాబితాను రూపొందించేందుకు గుర్తింపుపొందిన అన్నిరాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని ఆయన ఈ సందర్బంగా కోరారు. ఈ ప్రక్రియలో వారు కూడా భాగస్వామ్యుల అయ్యేలా తమ బూత్ స్థాయి ఏజంట్లను నియమించుకోవాలని కోరారు. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలకు అనుగుణంగా ముసాయిదా ఓటర్ల జాబితా, తుది ఓటర్ల జాబితా మరియు క్లైమ్ లు, అభ్యంతరాల జాబితాలను రెండు ప్రతుల్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు అందజేయడం జరుగుతుందన్నారు. ఆయా జాబితాల్లో వారికి ఎటు వంటి అభ్యంతరాలు ఉన్నా వెంటనే ఆ విషయాన్ని సంబందిత ఇ.ఆర్.ఓ., జిల్లా ఎన్నికల అధికారి, సి.ఇ.ఓ. దృష్టికి తీసుకొచ్చి వాటిని పరిష్కరించుకోవచ్చన్నారు. అయితే క్లైము లు మరియు అభ్యంతరాలకు సంబందించి ఏఒక్కరూ గాని, పార్టీ కాని చాలా మొత్తం మీద ఫార్ములు ఇవ్వడానికి అవకాశం లేదని స్పష్టంచేశారు. ముసాయిదా మరియు తుది ఓటర్ల జాబితాలను సి.ఇ.ఓ. వెబ్ సైట్లో కూడా అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు.
ఈ మద్యకాలంలో ఓటర్ల జాబితాలపై పలు ఆరోపణలు వస్తున్నాయని, పలు చోట్ల అవకతవకలు జరుగుచున్నట్లు పలు పత్రికల్లో కథనాలు ప్రచురితమవుతున్నాయని పలువురు విలేఖరు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాదానం చెపుతూ ఇప్పటికే ఊరవకొండకు సంబందించి ఇద్దరు బి.ఎల్.ఓ.లను సస్పెండ్ చేయడం జరిగిందని, అదే విధంగా విశాఖపట్నం, గుంటూరు, విజయవాడలకు సంబందించి నివేదికలు అందిన వెంటనే తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన స్పష్టంచేశారు. అదే విదంగా ఓటర్ల ఆధార్ డాటా ఇప్పటికే 80 శాతం సేకరించడం జరిగిందని, అయితే వాటిని ఓటర్లకు ఇంతవరకూ లింక్ చేయలేదని ఆయన తెలిపారు .