అదుపు చేయలేని అధికారులు
బావూరు మంటన్న తల్లిదండ్రులు
దర్శి నియోజకవర్గంలోని కొన్ని ప్రైవేటు పాఠశాలలకు తమ పిల్లల్ని పంపించాలనుకుంటేనే గుండెల్లో దడలు పుడుతున్నాయి. తాము ఎంత కష్టపడినా తమ కష్టం పిల్లలకు రాకూడదనే దృఢ సంకల్పంతో చదివించాలనుకునే తల్లిదండ్రులకు పుస్తకాల రేట్లు చూస్తే మతిపోతుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రభుత్వ పాఠ్యపుస్తకాలను అనుసరించి మాత్రమే సిలబస్ ను అన్ని పాఠశాలలు పాటించాల్సి ఉంది. దర్శి మండలంలో 26, తాళ్లూరు మండలంలో 08, కురిచేడు మండలంలో 06, దొనకొండ మండలంలో 04, ముండ్లమూరు మండలంలో 03 తో కలిపి దర్శి నియోజకవర్గంలో మొత్తం 47 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. వీటిలో కొన్ని ప్రైవేటు స్కూల్స్ మాత్రమే ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ పాఠ్య పుస్తకాలను అనుసరిస్తున్నాయి. మరికొన్ని స్వతహాగా సిలబస్ లను రూపొందించుకొని వాటినే పుస్తకాల రూపంలో ప్రింట్ చేయించుకొని పాఠశాలలలో విద్యార్థులకు అమ్మడం గమనార్హం. కొన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ప్రింట్ చేయించే పాఠ్య పుస్తకాలకు సుమారు 4వేల నుండి 10 వేల రూపాయల వరకు విద్యార్థుల నుండి వసూలు చేస్తున్నారు. స్కూల్ ఫీజులతో పాటు పుస్తకాల ఫీజులు కూడా అదే స్థాయిలో వసూళ్లు చేస్తుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు బావూరు మంటున్నారు. ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాల్సిన సంబంధిత అధికారులు కూడా చూసి చూడనట్లు పట్టినట్లు వ్యవహరించడం ఏమిటో అర్థం కాని ప్రశ్నగా మారింది. కనీసం ప్రైవేటు పాఠశాలలకు వెళ్లి తనిఖీలు చేసే పరిస్థితులు కూడా నియోజకవర్గంలో లేకపోవడం గమనార్హం. టెక్స్ట్ బుక్స్, యూనిఫార్మ్ లు వగైరా వంటివి మా దగ్గరే కొనాలంటూ ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు విద్యాశాఖ అధికారులు మాత్రం వారి పరిధిలో ఉన్న పాఠశాలలలో ప్రైవేటు పుస్తకాలకు తావు లేకుండా చేస్తున్నారు మరి కొందరు మాత్రం చోద్యం చూస్తూ నిమ్మకు నీరెత్తినట్లు ఉండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.