దర్శి సమీపంలోని ఎన్ఎస్పి కెనాల్ వద్ద మంగళవారం అర్ధరాత్రి సుమారు 1.00 AM సమయంలో జరిగిన RTC బస్సు రోడ్డు ప్రమాద ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ మలిక గర్గ్ పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరు, కారణాలను మరియు పరిస్థితిని నిశితంగా సమీక్షించి రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పోలీస్ అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం దర్శి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నక్షతగాత్రులను పరామర్శించి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.
ఈ ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన జిల్లా ఎస్పీ మలిక గర్గ్ మాట్లాడుతూ …రోడ్డు ప్రమాదం గురించి పోలీసులకు సమాచారం అందిన వెంటనే స్పందించి సంఘటన ప్రదేశానికి చేరుకొని రెస్క్యూ టీంతో సహాయక చర్యలు చేపట్టామని, క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించామని తెలిపారు.
09.07.2023 న పొదిలిలోని పెళ్లి కుమార్తె ఇంటి వద్ద వివాహం జరిగిందని, ఒంగోలు ఆర్టీసీ డిపో నుంచి ఇంద్ర (AP 27 Z 0353) బస్సును అద్దెకు తీసుకుని తేదీ:11.07.2023 న కాకినాడ లో జరగనున్న రిసెప్షన్ కు పొదిలి నుండి కాకినాడకు వెళ్తుండగా ఎదురుగా వేగంగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నుండి బస్సును ఎడమ వైపు మార్జిన్కు కట్ చేయడానికి ప్రయత్నించగా వంతెన సైడ్ దిమ్మెను ఢీకొని స్టీరింగ్ విరిగిపోయి బస్సు అదుపుతప్పి బ్రిడ్జి మీద నుండి క్రింద పడి ప్రమాదం జరిగిందని, ప్రమాదంలో 7 మంది మరణించగా బస్సు డ్రైవర్తో సహా 18 మంది గాయపడ్డారని తెలిపారు.
ప్రమాదాలను అరికట్టడానికి జిల్లా పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను డేంజర్ స్పాట్లను గుర్తించి లోపాలను అన్ని శాఖల సహకారంతో సరిదిద్దుతామని, రోడ్డు భద్రతా ప్రమాణాలపై వాహనదారులకు, ప్రజలకు తరచూ అవగాహన కార్యక్రమాలను నిర్వహించి ప్రమాదాలకు అడ్డుకట్ట వేస్తామని, ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాల వద్ద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేస్తామన్నారు.
వాహనదారులు ట్రాఫిక్ నియమ నిబంధనలను తూచా తప్పక పాటించాలని, డ్రైవర్లు వేగ పరిమితుల పట్ల జాగ్రత్త వహించి పరిమితమైన వేగంతో వెళ్ళాలని, రహదారి భద్రత సూత్రాలపై అవగాహన కలిగి ఉండాలని, ప్రజలు, యాత్రికులు ప్రతి ఒక్కరూ ప్రయాణ జాగ్రత్తలు పాటించాలని, వాహనాలు నడిపే సమయంలో సహనంతో ఉండి సురక్షితంగా, క్షేమంగా గమ్యాన్ని చేరాలని కోరారు.
జిల్లా ఎస్పీ వెంట ట్రైనీ ఐపీఎస్ అధికారి అంకిత సురాన , DSB DSP బి.మరియదాసు, దర్శి సబ్ డివిజన్ డిఎస్పీ అశోక్ వర్ధన్, దర్శి సిఐ రామకోటయ్య, దర్శి సర్కిల్ ఎస్సైలు మరియు తదితరులు పాల్గొన్నారు.





