తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం సాయంత్రం సాలకట్ల ఆణివార ఆస్థానం సందర్భంగా పుష్పపల్లకీ సేవ వైభవంగా జరిగింది.వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన పల్లకీపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు అభయమిచ్చారు.
పల్లకీ మందుభాగంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి, పక్క భాగంలో ద్వాపరయుగంలో చిన్నికృష్ణులు, వెనుక భాగంలో తమలపాకుల ప్రత్యేక అలంకరణలో హనుమంతుని ప్రతిమలను కొలువుదీర్చారు. 6 రకాల సంప్రదాయ పుష్పాలు, 6 రకాల కట్ ఫ్లవర్స్ కలిపి మొత్తం ఒక టన్ను పుష్పాలు వినియోగించారు. ఈరోడ్ కు చెందిన దాత శ్రీ సెంగుట్టవన్ సహకారంతో పల్లకీ పుష్పాలంకరణ చేపట్టారు. కార్యక్రమంలో టీటీడీ ఈఓ ఎవి.ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు మూరంశెట్టి రాములు, ఆలయ డెప్యూటీ ఈవో లోకనాధం, ఎస్ఇ-2 జగదీశ్వర్ రెడ్డి, పేష్కార్ శ్రీహరి, ఉద్యానవన విభాగం డెప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, విజిఓ బాలిరెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.




