రైతులు పంటల్లో సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే అధిక దిగుబడులు సాధించవచ్చు అని దర్శి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త ఎం .శివ అన్నారు. ముండ్లమూరు మండలంలోని భీమవరం గ్రామంలో బుధవారం ఎస్సీ, ఎస్టీ రైతులకు దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఏరియా కోఆర్డినేటర్ గోపన బోయిన వెంకట్రావు అధ్యక్షతన ఎస్సీ ఎస్టీ రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త మాట్లాడుతూ… మిరప సాగులో మొక్కలు నాటుకునే ముందు 45 రోజులు ముందుగా వచ్చే పచ్చిరొట్ట ఎరువులను కలియ దున్నాలని, మొక్కలు నాటుకునే ముందు నారు శుద్ధిచేసి మొక్కలు నాటినట్లయితే భూమి నుండి సంక్రమించే వ్యాధులను అరికట్టవచ్చన్నారు. దళిత బహుజన రిసోర్స్ సెంటర్ రీజనల్ కోఆర్డినేటర్ దార్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ రైతులు ప్రభుత్వం నుండి వచ్చే ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకొని అభివృద్ధి చెందాలన్నారు. ఎస్సీ ఎస్టీ రైతులు సుస్థిర వ్యవసాయంపై అవగాహన పెంచుకొని పంటలు పండించుకోవాలన్నారు.
