ఆదాయాన్ని బట్టి దేవాలయాల వర్గీకరణలో మార్పులు-ఆదాయానికి తగ్గట్టుగా భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు-ఉపముఖ్యమంత్రి, దేవాదాయ,ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ

రాష్ట్రంలోని పలు దేవాలయాల ఆదాయంలో మంచి పురోగతి కనిపిస్తున్న నేపథ్యంలో ఆదాయానికి తగ్గట్టుగా భక్తులకు సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో దేవాలయాల వర్గీకరణను త్వరలో చేపట్టనున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. మంగళవారం వెలగపూడి ఆంధ్రప్రదేశ్ సచివాలయం నాల్గో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని పలు దేవాలయాలకు భక్తుల తాకిడి ఎక్కువ అయిందని, అందుకు అనుగుణంగానే వాటి ఆదాయంలో కూడా మంచి పురోగతి కనిపిస్తున్నదన్నారు. అయితే ప్రస్తుతం దేవాలయాలకు వస్తున్న ఆదాయానికి అనుగుణంగా భక్తులకు పలు సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో ఆదాయానికి అనుగుణంగా వాటి వర్గీకరణను రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఆమోదంతో చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో నున్న దేవాలయాలను వాటి ఆదాయాన్ని బట్టి మూడు కేటగిరీలుగా విభజించి అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ మరియు రీజనల్ జాయింట్ కమిషనర్ ఆద్వర్యంలో నిర్వహించడం జరుగుచున్నదన్నారు. రూ.15 లక్షల నుండి 50 లక్షల ఆదాయం లోపు దేవాలయాలను అసిస్టెంట్ కమిషనర్, రూ.50 లక్షల కు పైబడి రూ.1.00 కోటి లోపు ఆదాయం ఉన్న దేవాలయాలను డిప్యూటీ కమిషనర్ మరియు రూ.1.00 కోటి కి పైబడి ఆదాయం ఉన్న దేవాలయాలను జాయింట్ కమిషనర్ పర్యవేక్షణలో ఉంచడం జరిగిందన్నారు. అయితే ఇప్పుడు ఆ మూడు కేటగిరీల ఆదాయ పరిమితిని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అసిస్టెంట్ కమిషనర్ ఆద్వర్యంలో ఉండే దేవాలయాల ఆదాయ పరిమితిని రూ.2 కోట్ల నుండి రూ.7.00 కోట్ల లోపు, డిప్యూటీ కమిషనర్ ఆద్వర్యంలోని దేవాలయాల ఆదాయ పరిమితిని రూ.7 కోట్లకు పైబడి రూ.12 కోట్ల లోపు మరియు రూ.12.00 కోట్ల ఆదాయానికి పైబడిన దేవాలయాలను జాయింట్ కమిషనర్ ఆద్వర్యంలోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ వర్గీకరణ నేపథ్యంలో అసిస్టెంట్ కమిషనర్ పోస్టులు 5 వరకూ, డిప్యూటీ కమిషనర్ పోస్టులు 15 వరకూ పెరగనున్నాయని, ఒక రీజనల్ జాయింట్ కమిషనర్ పోస్టు తగ్గనుందని ఆయన తెలిపారు. అయితే ఇందుకై అదనంగా పోస్టులను మంజూరు చేయాల్సిన పనిలేదని, ప్రస్తుతం మంజూరు కాబడిన క్యాడర్ స్ట్రెంగ్తు అధికారులతోనే ఈ పోస్టులను సర్థుబాటు చేసేందుకు అవకాశం ఉందన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe
అదే విధంగా ఇంతకు ముందు రాష్ట్రంలో  గ్రేడ్-1,2 & 3 దేవాలయాలు ఉండేవని, హైకోర్టు ఆదేశాల మేరకు రూ.5 లక్షలోపు ఆదాయం ఉండే దేవాలయాల నుండి ఎగ్జిక్యూటివ్ అధికారులను ఉపసంహరించడం జరుగుచున్నదన్నారు. అటు వంటి ఆలయాలకు చెందిన ఆస్తుల పరిరక్షణ, భూముల వేలం తదితర కార్యక్రమాలను స్థానికంగా ఉండే దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. అయితే ఆ దేవాలయాల నిర్వహణ కార్యక్రమాలను అర్చకులు గాని లేదా దేవాలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు గాని నిర్వహించడం జరుగుతుందన్నారు. అయితే  రాష్ట్ర వ్యాప్తంగా రూ.5 లక్షలోపు ఆదాయం ఉన్న దేవాలయాలు ఎన్ని ఉన్నాయో పున:సమీక్ష చేయమని  అధికారులను ఆదేశించనట్లు ఆయన తెలిపారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *