నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుంచి రబీ సాగు కోసం ఈ ఏడాది నీటి విడుదలకు అవకాశం లేదని కలెక్టర్ ఏ.ఏస్ దినేష్ కుమార్ స్పష్టం చేశారు. జిల్లా సాగు నీటి, వ్యవసాయ సలహా మండలి సమావేశం ఒంగోలు ప్రకాశం భవన్ లోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీశైలం, ఎన్నెస్పీ ప్రాజెక్ట్ ల్లోని నీటిని కేవలం తాగునీటి అవసరాలకే వినియోగించు కోవాలని కృష్ణా నది యాజమాన్య బోర్డు నిర్ణయం తీసుకుందని.. ఆ మేరకు రబీకి నీటిని విడుదల చేసే పరిస్థితి లేదన్నారు. మీడియం ప్రాజె క్లైన కంభం, మోపాడు ద్వారా నీటి విడుదలకు చర్యలు తీసుకోవాలని సూచించారు. రబీ సాగులో అవసరమైన విత్తనాలు, ఎరువులు సకాలంలో అందించేలా చూడాలన్నారు. సీసీఆర్సీ కార్డుదారులకు లక్ష్యాల రుణాలు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా వ్యవ సాయ సలహా మండలి చైర్మన్ ఆళ్ల రవీంద్రారెడ్డి మాట్లాడుతూ.. రైతులు డిమాండ్ చేస్తున్న కాక్-2 రకం శనగ విత్తనాల సరఫరా పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ ప్రసాద్ రెడ్డి, జల వనరుల శాఖ ఎస్ఈ లక్ష్మారెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ మర్దన్అలీ, జడ్పీ ఉప సీఈవో హనుమంతరావు, జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాసరావు, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారిణి బేబీరాణి తదితరులు పాల్గొన్నారు.



