ప్రకృతి సాగుతో పండించిన వరి ధాన్యముతో వ్యాధుల నియంత్రణ సాధించవచ్చు అని మండల వ్యవసాయ అధికారి బి ప్రసాదరావు అన్నారు . క్షేత్ర పర్యటనలో భాగంగా శుక్రవారం ఆయన రామభద్రాపురం, నాగం బొట్ల వారి పాలెం గ్రామాలలో పర్యటించి ప్రకృతి సాగు ద్వారా రైతులు పండించిన దేశవాళి పంట కాలా బట్టి వరి పంటను పరిశీలించారు. ఆయన రైతు కైపు సుబ్బారెడ్డి రైతు పండించిన పంటను పరిశీలించి మాట్లాడుతూ ప్రకృతి సాగు ద్వారా దేశవాళీ వరి వంగడమైన కాలా బట్టి నల్లబియ్యం పంట వల్ల వ్యాధులు దూరమవుతాయని ఆయన తెలిపారు. ప్రజలు నల్లబియ్యం వాడడం వల్ల క్యాన్సర్, నొప్పులు, గుండె జబ్బులు దూరమవుతాయని ఆయన తెలిపారు. నల్ల బియ్యం రకం వరి వంగడం మన ప్రాంతంలోని అన్ని నేలల్లో పండించవచ్చని ఆయన తెలిపారు. ఒక పర్యాయం ఆజోల్లా వేస్తే ఎరువు వేయ వలసిన అవసరం లేకుండా సరిపోతుందని ఆయన తెలిపారు. ఫైరు ఐదు అడుగుల ఎత్తు వరకు ఉంటుందని, దీని కంకి 7 అంగుళాల వరకు పెరుగుతుందని, ఎకరాకు 8 క్వింటాళ్ల దిగుబడి లభిస్తుందని ఆయన తెలిపారు. నల్ల బియ్యం ధాన్యం ధర 10,000 రూపాయల వరకు ఉంటుందని, కిలో బియ్యం 120 రూపాయలు ఉందని ఆయన తెలిపారు. ఒక ఎకరానికి రైతుకు 50 వేల రూపా యల వరకు లాభం చేకూరుతుందని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ సాగు మండల ఇంచార్జ్ పి నరసింహులు, గ్రామ వ్యవసాయ సహాయకులు డి.శ్రీను, రైతులు పాల్గొన్నారు.
