ఎన్నికల సమయంలో వచ్చి, తర్వాత మొఖం చాటేసి వారి మాటలను నమ్మొద్దని సనత్ నగర్ MLA అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. శనివారం బేగంపేట లోని ఓల్డ్ పాటిగడ్డ, నూర్ బాగ్ లలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పుడు ఎన్నికలు రావడం వలన మీ వద్దకు వస్తున్నారని, ఇన్ని రోజులు ఎక్కడికిపోయారని ప్రశ్నించారు. తాను నిరంతరం మీ మధ్యనే ఉంటూ మీ కష్ట సుఖాలను పంచుకున్నాననే విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత డ్రైనేజీ, రోడ్ల సమస్యలను పరిష్కరించామని చెప్పారు. పేద, మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకొని పలు సంక్షేమ కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. పేదింటి ఆడపడుచు పెండ్లికి కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ క్రింద ఒక లక్ష 116 రూపాయల ఆర్థిక సహాయం, వృద్ధులు, వితంతువులకు పెన్షన్ లు అందజేస్తున్నామని వివరించారు. ఓల్డ్ పాటిగడ్డ లోని JNNURM ఇండ్ల మరమ్మతులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని చెప్పారు. త్రాగునీటిని ఉచితం గా సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా స్థానిక పేద ప్రజలకు మేలు చేసే విధంగా పాటిగడ్డ లో 6 కోట్ల రూపాయల వ్యయంతో మల్టి ఫర్పస్ ఫంక్షన్ హాల్ ను నిర్మించామని చెప్పారు. ప్రయివేట్ ఫంక్షన్ హాల్స్ లలో లక్షల రూపాయల అద్దెను చెల్లించాల్సి ఉంటుందని, ఈ మల్టి ఫర్పస్ హాల్ ను కేవలం 17 వేల రూపాయల అద్దెకు ఇస్తారని తెలిపారు. సొంత ఇల్లు లేని పేదల కోసం ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఉచితంగా ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటి వరకు GHMC పరిధిలో 70 వేల ఇండ్లను ఇచ్చామని, రానివారు అధైర్య పడొద్దని అన్నారు. మీకు అన్ని విధాలా అండగా ఉంటూ మీ సమస్యల పరిష్కారానికి పాటుపడుతున్న తనను అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని కోరారు. మళ్ళీ BRS ప్రభుత్వం వచ్చిన తర్వాత 400 రూపాయలకు గ్యాస్ సిలెండర్,15 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం, రేషన్ ద్వారా సన్నబియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని వివరించారు. చేసిన అభివృద్ధిని గుర్తు పెట్టుకొని కారు గుర్తుపై ఓటేయాలని కోరారు. మంత్రి వెంట కార్పొరేటర్ టి. మహేశ్వరి, మాజీ కార్పొరేటర్ ఉప్పల తరుణి, డివిజన్ BRS అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, జనరల్ సెక్రెటరీ ఆరీఫ్, నాయకులు నరేందర్, శ్రీహరి, శేఖర్, మోహిన్, అజ్మత్, అఖిల్, జావీద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓల్డ్ పాటిగడ్డ లో BJP కి చెందిన సాయి, నాని, నితీష్, మహేష్ లు మంత్రి సమక్షంలో BRS పార్టీలో చేరారు.
ఎయిర్ లైన్స్ కాలనీలో…..
బేగంపేట లోని ఎయిర్ లైన్స్ కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. కాలనీలో అనేక సమస్యలను పరిష్కరించామని, ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయని వాటిని ఎన్నికల అనంతరం పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రధానంగా కాలనీలోని పార్క్ ను ఎంతో సుందరంగా తీర్చిదిద్దామని, ఒపెన్ జిమ్ ను కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. డ్రైనేజీ, రోడ్ల సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారం అయ్యాయని వివరించారు.మీకు అన్ని విధాలుగా అండగా ఉంటున్న తనను మరోసారి అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని కోరారు. ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని అన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కే తమ ఓట్లు వేస్తామని సమావేశంలో పాల్గొన్న కాలనీ వాసులు ముక్తకంఠంతో ప్రకటించారు. ఈ సమావేశంలో కాలనీ అధ్యక్షుడు నగేష్, జనరల్ సెక్రెటరీ గోపాల్, ఉపాధ్యక్షుడు అరవింద్, రాజేందర్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.









