నీళ్లు, నిధులు, నియామకాల డిమాండ్ తో ఏర్పాటు అయిన తెలంగాణ రాష్ట్రం టిఆర్ఎస్ పాలనలో అడుగడుగునా నిర్లక్ష్యానికి గురైందని బిజెపి సనత్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సనత్ నగర్ డివిజన్ పరిధిలోని అల్లావుద్దీన్ కోటి, ఎస్ ఆర్ టి కాలనీ, కైలాష్ నగర్, జక్ కాలనీ ప్రాంతాల్లో ఇంటింటి పాదయాత్ర నిర్వహించారు. ముస్లిం మైనార్టీలు అధికంగా ఉండే అల్లావుద్దీన్ కోటి లో సైతం ఆయనకు అనూహ్య స్పందన రావడం విశేషం. ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మర్రి శశిధర్ రెడ్డికి ప్రజలు హారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శశిధర్ రెడ్డి మాట్లాడుతూ నియామకాల విషయంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు. ఎంతో కష్టపడి విద్యార్థులు పరీక్షలకు ప్రిపేర్ అయితే ప్రభుత్వం లీకేజీల వ్యవహారంతో వారి జీవితాల్లో అంధకారాన్ని నింపిందన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పద్ధతిలోనే రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ను తీసుకువచ్చి ఎలాంటి అక్రమాలకు తావివ్వకుండా పరీక్షల నిర్వహణను చేపట్టనున్నట్లు వివరించారు. ప్రాజెక్టుల పేరిట భారీగా అంచనాలను పెంచి టిఆర్ఎస్ పాలకులు అవినీతిని పెంచి పోషించారని అన్నారు. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనాదక్షితను ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో సైతం బిజెపి అధికారంలో రావడం ద్వారా డబుల్ ఇంజన్ సర్కార్ తో అభివృద్ధి మరింత వేగవంతంగా జరుగుతుందన్నారు. టిఆర్ఎస్ కుటుంబ పాలనను అంతమొందించేందుకు ప్రజలంతా సిద్ధమయ్యార నీ అన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కెసిఆర్ కుటుంబం బాగు పడింది తప్ప ప్రజలకు ఒరిగింది ఏమీ లేదన్నారు. సనత్ నగర్ నియోజకవర్గ సమస్యలపై తనకు అనువణువు తెలుసునని, కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి తనను గెలిపిస్తే సమస్యలు లేని సనత్ నగర్ ను తీర్చిదిద్దుతానని చెప్పారు. తాను అధికారంలో ఉన్నా, లేకపోయినా ఎప్పుడు ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ వచ్చానన్నారు. అధికార పార్టీ నేతలు చేసే అక్రమాలపై ప్రశ్నిస్తూ వాటిని అడ్డుకోవడం జరిగిందన్నారు. ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా పాలనను అందించే బిజెపి జండా సనత్ నగర్ లో ఈసారి రెపరెప లాడనుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

