దివ్యాంగుల అభ్యున్నతికి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని వక్తలు అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలను ఆదివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ఘనంగా నిర్వహించారు. విభిన్న ప్రతిభా వంతులు మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు అర్చన అధ్యక్షతన సభను నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మేయర్ గంగాడ సుజాతలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం దివ్యాంగుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని వివరించారు. జిల్లాపరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమానికి ప్రభత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని గత ప్రభుత్వ హయాంలో ఇవ్వని కాంక్లియర్ ప్లాంట్ను సైతం ఇచ్చిన ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వంకు వస్తుందని, ఇంకా అనేక సంక్షేమ పధకాలు పెంచిన విషయాన్ని వివరించారు
మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ ఒంగోలులో దివ్యాంగులు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. సభా అధ్యక్షురాలు అర్చన, మెప్మా పీడీ రవికుమార్, బ్యాంక్ ఎల్డీఎం అబ్ధుల్ రహీమ్, మైనార్టీ కార్పోరేషన్ ఈడీ ధనలక్ష్మిలు ఆయా శాఖలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. దివ్యాంగ సంఘ నాయకులు శ్రీనివాస రెడ్డి, రాజేంద్రలు పలు సమస్యలను సభ దృష్టికి తెచ్చారు. పరిష్కారానికి జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖ అధికారులు సూచనలు చేసారు.
2020-21కి సంబంధించి ఎనిమిది మంది దివ్యాంగులకు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందించారు.
8 మంది దివ్యాంగులకు రూ. 52 వేలు విలువ చేసే ట్రై సైకిళ్లను 24వేలు విలువ చేసే మూడు వీల్ చైర్స్ ను అందజేసారు. మహిళల జీవనోపాథులు పెంపుదలకు దాత మైనంపాడు వాసి సౌర్యతేజ ఆయిల్ఫిల్లింగ్ స్టేషన్ యజమాని హరి ప్రసాద్ రూ. 35వేల విలుగల ఏడు కుట్టుమిషన్స్ అతిథులు చేతుల మీదుగా మహిళలకు అందజేసారు. వివిధ ఆటల పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు, ప్రశంశా పత్రాలు అందజేసారు.








