పదవతరగతి విద్యార్థులు పాఠ్యాంశాలను ఎకాగ్రతగా చదవటంతో పాటు పబ్లిక్ పరీక్షలలో ఇచ్చిన ప్రశ్నలకు తగినట్లు జవాబులను ఖచ్చితంగా రాయటం ఎంతో ముఖ్యమని జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్కుమార్ సూచించారు. ఒంగోలు అంబేద్కర్ భవన్ లో మంగళవారం ఒంగోలు, కొండేపి, దర్శి నియోజక వర్గాల పరిధిలోని పదవతరగతి చదువుతున్న సంక్షేమ వసతి గృహ విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు ఎదుర్కోనేందుకు సన్నద్ధతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు పాఠ్యాంశాల పట్ల అవగాహన పెంచుకుని వాటిని జవాబులు రూపంలో సక్రమంగా వ్యక్త పరచటం కీలకమని అన్నారు. జవాబు పత్రాను మూల్యాంకనం చేసే ఉపాధ్యాయులకు సదరు విద్యార్థులు ఎవరో తెలియదని, పరీక్ష పేపర్లో విద్యార్థులు వ్రాసిన నైపుణ్యమైన జవాబును గ్రహించి మార్కేలు వేస్తారని చెప్పారు. అందుకు రైటింగ్ స్కిల్స్ కూడ చాలా ముఖ్యమని అన్నారు. పబ్లిక్ పరీక్షలు 88 రోజుల గడువు ఉన్నందున ఇప్పటి నుండి ప్రతి రోజు కనీసం 15 నిముషాల పాటు వివిధ ప్రశ్నలకు జవాబులు రాయటం సాధన చెయ్యాలని సూచించారు. చిత్ర పటాలపై, మ్యాపింగ్పై కూడ అవగాహన పెంచుకోవాలని అన్నారు. ఒక అంశానికి సంబంధించి ఎన్ని విధాలుగా ప్రశ్నలు అడితే అడిగే అవకాశం ఉందో ముందుగానే గుర్తించి ఆ విధంగా జవాబులు రాసేలా విద్యార్థులను సమాయత్తంచెయ్యాలనిఉపాధ్యాయులను కోరారు. సంవత్సరం పాటు చదివిన పాఠ్యాంశాల నుచే పరీక్షలలో ప్రశ్నలు వస్తాయి కాబట్టి భయపడకుండా సన్నద్ధమవ్వాలని, ఉన్న సమయాన్ని ప్రణాళికాబద్ధంగా సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు మనోధైర్యంతో ముందుకు సాగాలని దీవించారు.
జిల్లా విద్యాశాఖాధికారి విఎస్ సుబ్బారావు మాట్లాడుతూ మెరుగైన ఫలితాలు సాధించేలా వంద రోజుల ప్రణాళికను సన్నద్ధం చేస్తున్నామని చెప్పారు. పరీక్షలలో విద్యార్థులు పాటించాల్సిన జాగ్రత్తలను, ఉపాధ్యాయులు సన్నద్ధం చెయ్యాల్సిన విధానాలను సూచించారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులు నివాళులు అర్పించారు. కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
కార్యక్రమంలో జిల్లా పరిషత్ విద్యాధికారి సామా సుబ్బారావు, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మా నాయక్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి జగన్నాధరావు, బిల్లా బీసీ సంక్షేమ అధికారి అంజల, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి సురేష్ కన్నా, మైనార్టీ కార్పోరేషన్ ఈడీ థనలక్ష్మి, సంక్షేమ వసతి గృహ అధికారులు తదితరులు పాల్గొన్నారు.



