మార్గశిర మాసం, ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఒంగోలు నగరంలోని దేవాలయములన్నీ భక్తులతో కిటకిటలాడాయి. నగరమంతా ఆధ్యాత్మిక శోభతో అలరారింది. ముక్కోటి పర్వదినాన్ని పురస్కరించుకొని దేవాలయముల కమిటీలు ఆలయములను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది స్వామివారి ఉత్సవమూర్తులతో ఉత్తర ద్వారమున భక్తులను అనుగ్రహించడానికి ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజామున నాలుగు గంటల నుండి భక్తులు స్నాన పానాదులు ముగించుకుని అత్యంత భక్తి భావంతో స్వామివారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో ఆలయములకు విచ్చేశారు. స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణ క్యూలైన్లు నిండిపోయాయి. ఎంతో నిరీక్షణ తర్వాత స్వామిని దర్శించిన భక్తులు ఆనంద పరవశంతో ఓలలాడారు. దేవుని నామస్మరణతో పరిసరాలన్నీ మార్మోగాయి. కుటుంబ సమేతంగా తమ పిల్లాపాపలతో ఆలయములకు విచ్చేసిన భక్తులతో నగర పురవీధులు కళకళలాడాయి. స్థానిక కేశవ స్వామి పేట శ్రీ లక్ష్మీ ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవాలయం, గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరుని ఆలయము, విజయదుర్గా దేవి ఆలయము, వీరాంజనేయ స్వామి ఆలయము, అమలనాధుని వారి వీధిలోని శ్రీ వాసవికన్యకా పరమేశ్వరి ఆలయము, కోదండరామ స్వామి ఆలయములు, గీతా మందిరము, నిత్యమందిరము, గుర్రం వారి వీధి రామాలయము, వేణుగోపాలస్వామి ఆలయము, ఈమని పాలెం కృష్ణ మందిరం, సీతారామపురంలోని వరాలనాగేంద్ర స్వామి, రామాలయం, శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, గద్దలగుంట శ్రీ లక్ష్మీ ప్రసన్న చెన్నకేశవ స్వామి ఆలయం, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, వరసిద్ధి వినాయక ఆలయము, తూర్పుపాలెం శివాలయం, అయ్యప్ప స్వామి దేవాలయం, సంతపేట శిరిడి సాయి మందిరం, రాఘవేంద్ర స్వామి బృందావనం, ఆంజనేయ స్వామి దేవాలయం, ఇలా నగరంలోని దేవాలయములన్నీ భక్తుల రాకతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి ఆలయ కమిటీలు పోలీస్ పోలీస్ సిబ్బంది భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా పర్యవేక్షణ చేశారు.




