వ్యవసాయ పరిశోధన ఫలాలు రైతులకు అందేలా చూడాలని దర్శి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ తూము వెంకటేశ్వర రెడ్డి, డాక్టర్ ఉషారాణి లు తెలిపారు. తాళ్లూరులోని రైతు భరోసా కేంద్రం నందు శనివారం మండల వ్యవసాయ అధికారి బి ప్రసాద్ రావు అధ్యక్షతన నువ్వుల ప్రథమ శ్రేణి పరిశోధన క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ తూము వెంకటేశ్వర్ రెడ్డి డాక్టర్ ఉషారాణి లు మాట్లాడుతూ ధ్రువీకరణ విత్తనం ద్వారా విత్తనోత్పత్తిని సాధించినట్లయితే రైతులకు లాభదాయకంగా ఉంటుందని వారు తెలిపారు. వ్యవసాయ రంగంలో ఎప్పటికప్పుడు నూతనత్వాన్ని సాధించడానికి కృషి విజ్ఞాన కేంద్రాలు,వ్యవసాయ పరిశోధనా సంస్థలు పలు పరిశోధనలు నిర్వహించి నూతన విత్తనాలను తయారు చేయడం జరుగుతుందని వారు తెలిపారు. ఆ క్రమంలో ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు విడుదల చేసిన యలమంచిలి -66 రకం నువ్వుల విత్తనాలు ఇక్కడి నేలలకు సక్రమంగా సరిపోతాయని, వీటిని సామూహిక ప్రదర్శన క్షేత్రాల ద్వారా రైతులకు అవగాహన కల్పించి పంట వ్యాప్తికి కృషి చేయాలని వారు తెలిపారు. ధ్రువీకరణ విత్తనం, నేల తయారీ, విత్తన శుద్ధి, కలుపు నియంత్రణ తదితర అంశాలతో పాటు, ఎరువుల యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యలు, కోతల తరువాత నిల్వ చేయడంలో చేపట్టవలసిన నియమాలను గురించి వారు రైతులకు వివరించారు. తదుపరి రైతు ప్రదర్శన క్షేత్రంలో 25 మంది రైతులకు యలమంచిలి 66 రకం నువ్వుల విత్తనాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు నాగరాజు నాయక్, వెంకట రావు, రైతులు పాల్గొన్నారు.

