ఆర్యవైశ్యుల కులదేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి నిజరూప దర్శనము, ఆత్మార్పణ దినోత్సవమును పురస్కరించుకొని ఒంగోలు అమలనాధుని వారి వీధిలో కొలువైయున్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానము నందు ఆలయ తదియారాధన సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా 11వ తేదీ ఆదివారం ఉదయం గంటలకు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం ఎనిమిది గంటలకు విజయవాడ వాస్తవ్యులు, వేదపండితులు అంబటిపూడి మారుతీ ప్రసాద్ శర్మ చే శ్రీ చంఢీ హోమం శాస్త్రోక్తముగా నిర్వహించారు. పూర్ణాహుతి తో యాగం పరిసమాప్తం అయ్యింది. సాయంత్రం 6 గంటలకు శ్రీ వేణుగోపాల స్వామి భజనమండలి వారు శ్రీవాసవి గానామృతమును ఆలపించారు. నగరంలోని ఆర్య వైశ్యులు పెద్ద సంఖ్యలో ఆలయము నకు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. సాయంత్రం జరిగిన కార్యక్రమంలో శ్రీ వాసవి కోలాట భజన మండలి వారిచే కోలాటం, గుడి ఉత్సవం ఘనంగా జరిగినది. 8.30 గంటలకు నవ హారతులతో అమ్మవారికి నీరాజనాలు సమర్పించారు.


