తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) నూతన జాయింట్ డైరక్టర్ గా కె.అపూర్వ రావు బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ బస్ భవన్ లోని తన ఛాంబర్ లో ఆమె మంగళవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. సీఐడీ, ఎస్పీగా విధులు నిర్వర్తిస్తోన్న అపూర్వరావు ని టీఎస్ఆర్టీసీ జాయింట్ డైరెక్టర్ గా ప్రభుత్వం సోమవారం నియమించింది. హైదరాబాద్ చెందిన ఆమె.. 2014 ఐపీఎస్ బ్యాచ్ అధికారిణి. వనపర్తి, గద్వాల, నల్లగొండ జిల్లాలకు ఎస్పీగా గతంలో పనిచేశారు. టీఎస్ఆర్టీసీకి జాయింట్ డైరెక్టర్ గా ఒక మహిళా ఐపీఎస్ అధికారిణి నియమితులవడం ఇదే తొలిసారి.
టీఎస్ఆర్టీసీ జాయింట్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన కె.అపూర్వరావుకు సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ శుభాకాంక్షలు తెలియజేశారు. సంస్థ అభివృద్ధికి నిబద్ధతతో పనిచేయాలని ఆమెకు సూచించారు. ప్రజా రవాణా వ్యవస్థను ప్రాముఖ్యతను గుర్తించి టీఎస్ఆర్టీసీ చరిత్రలో తొలిసారిగా మహిళా ఐపీఎస్ అధికారిని జాయింట్ డైరెక్టర్ గా నియమించినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సజ్జనర్ కృతజ్ఞతలు తెలియజేశారు.
తనను జాయింట్ డైరెక్టర్ గా నియమించిందుకు ఈ సందర్బంగా ప్రభుత్వానికి కె.అపూర్వరావు కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు సౌకర్య పథకం విజయవంతంగా అమలవుతోందని, ఆ పథకం మరింత సమర్థవంతంగా అమలుచేసేందుకు తన వంతుగా కృషి చేస్తానని ఆమె అన్నారు. దేశ ప్రజా రవాణా వ్యవస్థలో తనదైన ముద్ర వేస్తోన్న టీఎస్ఆర్టీసీ వృద్ధికి పాటుపడతానని చెప్పారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన అపూర్వ రావు కి ఆర్టీసీ ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలియజేశారు.
