చెక్కు బౌన్స్ కేసులో క్యారెక్టర్ ఆర్టిస్ట్, సినీ నిర్మాత బండ్ల గణేష్ కు ఏడాది సాధారణ జైలు శిక్ష విధిస్తూ ఒంగోలు 2వ అదనపు మున్సిఫ్ మేజిస్ట్రేట్ పి.భానుసాయి బుధవారం తీర్పు చెప్పారు. ప్రకాశం జిల్లా మద్దిరాల ముప్పాళ్ళకు చెందిన జెట్టి జానకి రామయ్య వద్ద వ్యాపారం కోసం 2019లో బండ్ల గణేష్ రూ.95 లక్షలు అప్పుగా తీసుకున్నారు. అనంతరం జానకి రామయ్య చనిపోయాడు. దీంతో రామయ్య తండ్రి వెంకటేశ్వర్లు గణేష్ ను డబ్బులు అడిగాడు. బ్యాంకు ఖాతాలో డబ్బులు ఉన్నాయని పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్ పేరుతో రూ.95 లక్షలకు చెక్కు ఇచ్చాడు. ఆ చెక్కు బౌన్స్ అయ్యింది. ఈ క్రమంలో వెంకటేశ్వర్లు అనేకసార్లు బండ్ల గణేష్ ను డబ్బులు ఇవ్వాలని కోరగా ఇవ్వలేదు. దీంతో జెట్టి వెంకటేశ్వర్లు ఒంగోలు 2వ అదనపు మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించాడు. కేసు విచారణలో భాగంగా బండ్ల గణేష్ ఒంగోలు కోర్టుకు వచ్చారు. బాధితుడి తరపున లాయర్ గోనుగుంట శ్రీకాంత్ వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న జడ్జి నేరం రుజువు కావటంతో బండ్ల గణేష్ కు ఏడాది సాధారణ జైలు శిక్ష, రూ.95 లక్షల నష్ట పరిహారం, కోర్టు ఖర్చులకు రూ.10 వేలు బాధితుడి చెల్లించాలని చెబుతూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. పైకోర్టులో అప్పీలు చేసుకోవటానికి నెల రోజులను గడువు ఇచ్చారు.
