రాచర్లలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో పదవ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరము మరియు రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులను ఉద్దేశించి మార్గదర్శిని మానిటరింగ్ మరియు జిల్లా పర్యవేక్షకులు రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు మార్కాపురం రామ్ భూపాల్ రెడ్డి పబ్లిక్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు మోటివేషన్ క్లాస్ నిర్వహించారు. విద్యార్థులు పబ్లిక్ పరీక్షలకు మానసిక ఒత్తిడి ద్వారా కాకుండా, పండుగ వాతావరణం లో సంతోషంగా పరీక్ష గదిలోకి అడుగు పెట్టాలి అని తెలియజేశారు. తాము సంవత్సర కాలం పాటు నేర్చుకున్న విషయాలన్నింటినీ ఒకసారి నెమరు వేసుకుని సమాధానాలు రాయాలంటే మానసిక ఒత్తిడి ఉండకూడదు. ఆహ్లాద వాత వరణము ఉన్నప్పుడే చదువుకున్న, నేర్చుకున్న విషయాలు జ్ఞాపకము రాగలవు అని విద్యార్థులకు తెలిపారు. పరీక్ష హాల్లో విద్యార్థులు ప్రశ్నాపత్రానికి సమాధానాలు రాయవలసిన విధానము, తమకు తెలియని ప్రశ్నలకు జవాబులు రాసే విధానము,విద్యార్థులు పరీక్ష హాల్లో ఉండవలసిన క్రమశిక్షణ గురించి విద్యార్థులకు పూర్తి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ A. విజయ సంజీవి,వైస్ ప్రిన్సిపల్ T.మేరి కుమారి, పాఠశాల,కళాశాల ఉపాధ్యాయులు, లెక్చరర్స్ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ సూచనల మేరకు జిల్లాలోని గురుకుల పాఠశాలలకు, జూనియర్ కళాశాలలకు, ఉన్నత పాఠశాలలకు, వసతి గృహాల విద్యార్థులకు పరీక్షలపై ఎటువంటి భయం లేకుండా, సంతోషకర వాతావరణంలో హాజరు కావలసిందిగా మోటివేషన్ చేస్తున్నారు. విద్యార్థులకు పరీక్షల పట్ల పూర్తి అవగాహన కల్పించి,చక్కని మార్గ నిర్దేశం చేసినందుకు కళాశాల సిబ్బంది రామ్ భూపాల్ రెడ్డి గారిని అభినందించారు.
