రైతు ఉత్పత్తిదారుల సంఘాల బలోపేతానికి గ్రామ వ్యవసాయ సహాయకులు, విస్తరణాధికారులు, సాంకేతిక సహాయకులు కృషి చెయ్యాలని జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్ కోరారు. ఆత్మ డిఆర్సీ ఆధ్వర్యంలో గురువారం మొదటి బ్యాచ్ దర్శి, గిద్దలూరు సబ్ డివిజన్ పరిధిలోని వ్యవసాయ సహాయకులకు మూడు రోజుల పాటు శిక్షణా కార్యక్రమం ఆత్మ పీడీ అన్నపూర్ణ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్ మాట్లాడుతూ గ్రామాలలో రైతు ఉత్పత్తి సంఘాల బలోపేతం చేసుకుని రైతులు వారి సమస్యలను సంఘాల ద్వారానే పరిష్కరించుకునే విధంగా సంఘాల బలోపేతానికి క్షేత్ర స్థాయిలో వ్యవసాయ సిబ్బంది సలహాలు, సూచనలు ఇవ్వాలని చెప్పారు. ప్రతి రైతు వ్యవసాయ ఖాతాను ఏర్పాటు చేసుకుని ఆదాయ, వ్యయాలను నమోదు చేసుకునే విధంగా గ్రామ స్థాయి వ్యవసాయ సహాయకులు రైతులకు సలహాలు ఇచ్చి ఆర్ధిక అక్షరాస్యతపై అవగతాహన కల్పించి వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చాలని సూచించారు. ఆత్మ పీడి అన్నపూర్ణ మాట్లాడుతూ వ్యవసాయ సహాయకులు వ్యవసాయంతో పాటు ఇతర అనుబంధశాఖలైన పశుపోషణ, ఉద్యానవన, మార్కేటింగ్ శాఖలు అందిస్తున్న సేవలపై మరింత అవగాహన పెంచుకున్నట్లయితే రైతులకు మెరుగైన సేవలు అందించవచ్చని చెప్పారు. వ్యవసాయశాఖ జెడీఏ శ్రీనివాసరావు, జిల్లా ఉద్యానవనశాఖాధికారి ఎన్ గోపిచంద్, ఎపీఎంఐపీ పీడి రమణ, డిటీసీ సుధాకర్ రాజు, సెరికల్చర్ ఎడీ సజయ్ కుమార్, మార్కేటింగ్ ఎడీ ఉపేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.


