భక్తితోనే ముక్తి – శ్రీగిరి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలకు భక్తుల నుండి అపూర్వ స్పందన – భక్తి మార్గ విశిష్టతను వివరించిన పొన్నూరు వెంకట శ్రీనివాసులు

ఒంగోలులోని కుర్తాళం శ్రీ సిద్దేశ్వరీ పీఠ పాలిత శ్రీగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాల ప్రత్యేక కార్యక్రమాలు గురువారం ప్రారంభమైనాయి. జగముల నేలే బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకోవడంతో పాటు భక్తితో స్మరించుకున్నారు. ఆలయ అర్చకులు వేద పండితులు శ్రీవారికి తోమాల సేవతో పాటు తులసి దళాలతో సహస్రనామార్చన నిర్వహించారు. సాయంత్రం హనుమంత వాహనం పై ఉభయ దేవేరులతో కొలువుదీరిన శ్రీవారిని భక్తులు నేత్రపర్వంగా దర్శించుకుని పులకితులైయ్యారు. భక్త జన పరిరక్షకుడైన శ్రీవారికి భక్త్యంజలులు సమర్పించారు. భక్తుల గోవింద నామ స్మరణతో శ్రీగిరి ప్రతిధ్వనించింది.
ఆధ్యాత్మిక ఉపన్యాసకులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు శ్రీవారికి నిర్వహించే బ్రహ్మోత్సవాలు వాహన సేవల ప్రాముఖ్యతతో పాటు నవ విధ భక్తి మార్గాల గురించి చక్కగా వివరించారు. తనను ఆశ్రయించిన భక్తుల పాపాలను తొలగించి కోరిన వరాలను అనుగ్రహించే కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని భక్తులు నియమ నిష్ఠలతో ఆరాధించి స్వామి వారి అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరారు. శ్రీగిరి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్ పర్సన్ ఆలూరు ఝాన్సీ రాణి, కార్య నిర్వహణ ధర్మకర్త సి వి రామకృష్ణారావు, ధర్మకర్తలు ఆలూరు వెంకటేశ్వర రావు, ఆలూరు లక్ష్మి కుమారి పొన్నూరు వెంకట శ్రీనివాసులును ఘనంగా సత్కరించారు.
శ్రీగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి శరన్నవ రాత్రి ప్రత్యేక కార్యక్రమాలలో భాగంగా శుక్ర వారం సాయంత్రం 7 గంటలకు శ్రీవారికి ఊంజల సేవ..శ్రీగిరి దేవస్థానం ఆస్థాన సంగీత విద్వాంసులు వి వి ఎస్ వినోద్ కుమార్ చే భక్తి సంగీత విభావరి జరుగుతాయని శ్రీగిరి దేవస్థానం నిర్వహకులు తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *