ఈవీఎంలపై ఎలన్ మస్క్ మరోసారి సంచలన వ్యాఖ్యలు…

ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్‌ను ఉపయోగించాలన్న మస్క్
అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న తరుణంలో తన అభిప్రాయం వెల్లడి
ఓటింగ్ యంత్రాలను సులభంగా హ్యాక్ చేయవచ్చన్న ఎలన్ మస్క్

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్‌ను ఉపయోగించాలని ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ఎలన్ మస్క్ సమర్థించారు. అంతేకాదు ఓటింగ్‌ మెషీన్‌పై కూడా ఆందోళన కరమైన అంశాన్ని పంచుకున్నారు. కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాయంతో ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చని ఆరోపించారు. అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న తరుణంలో మస్క్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భారతదేశంలో కూడా ఓటింగ్ యంత్రాల (ఈవీఎంలు) విషయంపై గతంలో మస్క్ అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పెన్సిల్వేనియాలో జరిగిన డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఎలాన్ మస్క్ మాట్లాడుతూ.. ఓటింగ్ యంత్రాలు ఎన్నికలను రిగ్ చేస్తున్నాయన్నారు.

డొమినియన్ ఓటింగ్ యంత్రాలపై ప్రశ్నలు లేవనెత్తారు. ఈ యంత్రాలను ఫిలడెల్ఫియా, మారికోపా కౌంటీలలో ఉపయోగిస్తున్నారని, అయితే చాలా ఇతర ప్రదేశాలలో ఉపయోగించలేదని ఆయన చెప్పారు. ఇది యాదృచ్చికంగా అనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లను మాత్రమే ఉపయోగించాలని, వాటిని చేతితో లెక్కించాలని కోరారు. “నేను సాంకేతిక నిపుణుడిని. నాకు కంప్యూటర్ల గురించి బాగా తెలుసు. నేను కంప్యూటర్ ప్రోగ్రామ్‌ను విశ్వసించనను. ఎందుకంటే దానిని హ్యాక్ చేయడం చాలా సులభం. పేపర్ బ్యాలెట్ విషయంలో ఆ అవకాశం లేదు. ప్రజాస్వామ్య దేశాలలో పేపర్ బ్యాలెట్ ఆధారంగానే ఎన్నికలు నిర్వహించాలి” అని మస్క్ అభిప్రాయపడ్డారు. కాగా.. ఈ సారి ఎన్నికల్లో ఎలన్ మస్క్ రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతుదారుగా నిలిచారు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు ట్రంప్ రాజకీయ కార్యాచరణ కమిటీకి 75 మిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *