బేగంపేట శ్రీ రేణుక ఎల్లమ్మ నాగదేవత ఆలయంలో మంగళవారం నాగుల చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయం వద్ద భక్తులు పుట్టలో పాలు పోసేందుకు, పూజలు నిర్వహించుకునేందుకు
ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆలయ ఫౌండర్ చైర్మన్ జాండ్ల కృష్ణ ఆధ్వర్యంలో ముందస్తు ఏర్పాట్లు చేశారు.
కార్తీకశుద్ద చతుర్థి దీపావళి వెళ్ళిన నాలుగో రోజు వస్తుంది. పుట్టిన బిడ్డలు బ్రతకక పోయినా, పిల్లలు కలుగకపోయినా, నాగ ప్రతిష్ట చేసి పూజించటం సాంప్రదాయంగా వస్తుంది. అలా నాగ మహిమతో పుటిన సంతానానికి, నాగలక్ష్మి, నాగేశ్వరరావు, నాగయ్య వగైరా పేర్లు పెట్టుకుంటారు .
మన పురాణాలలో నాగుల చవితి గురుంచి ఎన్నో గాథలు ఉన్నాయి. దేశమంతట పలు దేవాలయల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుడు నీ శివభావముతో ఆరాదిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని నమ్మకం భక్తుల లో వుంది.
మానవ శరీరం లో తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటారు. నాడులతో నిండివున్న వెన్నెముకను ‘వెనుబాము’ అని అంటారు. అందులో కుండలినీ శక్తి మూలాధారచక్రంలో “పాము” ఆకారంలో వుంటుందని “యోగశాస్త్రం” చెబుతోంది .
ఇది మానవ శరీరంలో నిదురిస్తున్నట్లు నటిస్తూ, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని కక్కుతూ, మానవునిలో ‘ సత్వగుణ’ సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్పపుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే..మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది, అందరి హృదయాలలో నివశించే ‘ శ్రీమహావిష్ణువు” కు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే! ఈ నాగుపాము పుట్టలో పాలు పోయడం లో వున్న అంతర్యమని చెప్తారు.
ఈ రోజున ఉదయమే, తలస్నానము చేసి పుట్టదగ్గరికి వెళ్ళి, నాగరాజును పూజించి పాలు పోసి చలిమిడి, చిమ్మిలి, అరటిపళ్ళు, తాటి బుర్రగుంజు, తేగలు మున్నగున్నవి నివేదన చేస్తారు. ఆ పుట్ట మట్టిని పుట్టబంగారం అని, దానిని కొద్దిగా తీసుకొని చెవి దగ్గర పెట్టుకుంటారు .
ముఖ్యముగా చెవి బాధలు వున్నవారికి ఈ పుట్టబంగారం పెడితే చెవి బాధ తగ్గుతుందంటారు. ఆ సందర్భంగా పుట్ట వద్ద “దీపావళి” నాడు మిగిలిన మతాబులు, కాకరపువ్వొత్తులు, టపాసులు మొదలైనవి చిన్నపిల్లలు ఎంతో సంతోషంగా కూడా కాలుస్తారు.



