ఒంగోలులోని కలెక్టరేట్ లోని మీటింగ్ హాలులో మంగళవారం సాయంత్రం
ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా , జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ కలిసి డిస్ట్రిక్ట్ కన్సల్టెటివ్ కమిటీ (DCC), డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూ కమిటీ (DLRC) మరియు బ్యాంకర్స్ తో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా నగదు లావాదేవీలకు సంబంధించి జరిగే ఆర్థిక నేరాలు మరియు సైబర్ నేరాలు ముఖ్యంగా ప్రజల అత్యాశ, భయాందోనలను ఆసరాగా చేసుకొని ఫేక్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, అపరిచితుల నుంచి ఎస్ఎంఎస్, ఈ-మెయిల్, వాట్సప్ల ద్వారా వచ్చే ఫేక్ లింక్స్, ఫేక్ లోన్ యాప్స్, డిజిటల్ అరెస్ట్, ఆన్ లైన్ మోసాలు, ఫేక్ బ్యాంక్ పాలసీ, బ్యాంకు రివార్డ్స్ మరియు ఇతర స్కామ్ ల గురించి బ్యాంక్ అధికారులకు అవగాహన కల్పించి వాటి నివారణకు బ్యాంకులు తీసుకోవాల్సిన చర్యల గురించి వారికి వివరించారు.
సమాజంలో పెరుగుతున్న సైబర్ నేరాలపై బ్యాంకర్లు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, బ్యాంకు కస్టమర్లకు సైబర్ క్రైమ్ గురించి అవగాహన కల్పించేలా కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రజలకు అప్రమత్తత ఏర్పడేలా బ్యాంకుల్లో పోస్టర్లు/బోర్డులను ఏర్పాటు చేసుకోవాలని, ప్రతి బ్యాంకులో సైబర్ క్రైమ్ హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అకౌంట్ ఓపెన్ చేసే సమయంలో కస్టమర్ల వివరాలను సమగ్రంగా తీసుకోని వాటిని వెరిఫై చేయాలని, బ్యాంక్ అకౌంట్ లో ఏమైనా అనుమానాస్పద ట్రాన్సాక్షన్ జరిగిన వెంటనే కస్టమర్స్ కు మరియు పోలీసులకు తెలియజేయాలన్నారు.
ఏటీఎంల వద్ద కచ్చితంగా 24 x7 సీసీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డ్ మరియు అలారం సిస్టం ఏర్పాటు చేసుకోవాలని, ప్రజలు సైబర్ మోసాలకు గురి కాకుండా ఇరు విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని, సైబర్ క్రైమ్ జరిగినప్పుడు బ్యాంక్ అధికారులు సత్వరమే స్పందించి సంబంధిత అకౌంట్లను ఫ్రీజ్ చేయాలని, బాధితులకు న్యాయం జరిగే విధంగా పోలీస్ వారికి సహకరించాలన్నారు. బ్యాంకు ఖాతాదారులు ఏవరైనా ఆన్ లైన్ మోసాల బారిన పడి బ్యాంకులకు వచ్చినట్లయితే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 1930 మరియు వెబ్ సైట్ www.cybercrime.gov.in గురించి అవగాహన కల్పించి, ఫిర్యాదు చేయించాలన్నారు.
సమావేశంలో ఒంగోలు డిఎస్పీ ఆర్. శ్రీనివాసరావు, సైబర్ సెల్ సీఐ వి. సూర్య నారాయణ, అర్ . ఏస్. ఐ భరత్ మరియు ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.





