వాట్సాప్, ఫేస్బుక్, ఇన్ స్టాగ్రామ్, టెలిగ్రామ్, యూట్యూబ్, ఎక్స్ (ట్విట్టర్) మరియు ఇతర సోషల్ మీడియాలో ఇతరులను కించపరిచేలా అసభ్యకరమైన, అనైతిక, అవమానకర రీతిలో పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.
సామాజిక మాధ్యమాల్లో సమాజంలోని వ్యక్తులపై, సంస్థలపై గాని హేయమైన, జుగుప్సాకరమైన పదజాలంతో ఫొటోలు/వీడియోలు మార్ఫింగ్, ట్రోలింగ్ చేసినా, వ్యక్తిగత దూషణలు, బెదిరింపులు, కించపరిచే వ్యాఖ్యలు చేస్తే బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇతరుల మనోభావాలు, మానాభిమానులు దెబ్బతినేలాగానీ కుల/మత/రాజకీయ వర్గాల మధ్య విద్వేషాలు రగిల్చేలా, మతపరమైన, సున్నిత అంశాల్లో వదంతులు/అవాస్తవాలు ప్రచారం చేస్తూ శాంతి భద్రతలకు భంగం కలిగించేలా పోస్టులు పెట్టరాదన్నారు.
సోషల్ మీడియాలో అసభ్యకరమైన, హేయమైన, విద్వేషకర పోస్టులు చేసే వారిపై, నిజానిజాలు తెలుసుకోకుండా వివాదాస్పద విషయాలు లేదా తప్పు దారి పట్టించే ఫేక్ న్యూస్ పెట్టినా షేర్ చేసే వారిపై, సంబంధిత గ్రూప్ అడ్మిన్ల పై చట్ట ప్రకారం చర్యలు తప్పవన్నారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులు పెట్టడానికి ప్రోత్సహించటం, సహకరించటం, కుట్ర చేయటం వంటివి కూడా చట్టరీత్య నేరమని తెలిపారు.
సోషల్ మీడియాలో తప్పుడు, రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిని పోలీసులు సైబర్ సెల్ లోని సోషల్ మీడియా టిమ్ ద్వారా నిరంతరం గమనిస్తూ ఉంటారని, కావున సోషల్ మీడియాలో పోస్టులు చేసేటప్పుడు జాగ్రత్తగా అప్రమత్తతో వ్యవహరించాలని, ముఖ్యంగా యువత, వారి భవిష్యత్తును అనవసర పోస్ట్ల ద్వారా బంగారు జీవితాన్ని నాశనం చేసుకోవద్దని, ఒకసారి కేసు నమోదు అయితే ఉద్యోగావకాశాలు, పాస్పోర్ట్, వీసాల కోసం ఇబ్బందులు ఎదురవుతాయని సూచించారు.
