పోలీస్ స్టేషన్ స్థితిగతులు, సిబ్బంది పని తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించడానికి ఒంగోలు వన్ టౌన్ పియస్ ను శనివారం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ మీడియా సమావేశం అనంతరం సందర్శించి పోలీస్ స్టేషన్ ఆవరణాన్ని,గదులను, రిసెప్షన్ కౌంటర్, స్టేషన్ పరిసరాలు, టౌన్ మ్యాప్ ను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో లా అండ్ ఆర్డర్, నేర నివారణ వ్యూహాలపై తీసుకుంటున్న చర్యలపై అధికారులను ఆరా తీసి పలు సూచనలు చేసారు. పోలీస్ స్టేషన్ లో పెండింగ్ కేసుల వివరాలు తెలుసుకొని వాటిని త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేయాలన్నారు.
స్టేషన్లో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు, వారి విధుల వంటి వాటిపై ఆరాతీశారు. రాత్రి వేళల్లో పోలీసులు పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని, గస్తీ విధులు పటిష్టంగా నిర్వర్తించి నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. డయల్ 112 కాల్స్ పై సిబ్బంది నిత్యం అప్రమత్తంగా అంకితభావంతో చురుగ్గా, సమర్ధవంతంగా విధులు నిర్వహించాలని సూచించారు. అలాగే వృత్తిపరంగా ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
స్కూల్స్, కళాశాల విద్యార్ధినిలకు గుడ్ టచ్ & బాడ్ టచ్, ఈవ్ టీజింగ్, ర్యాగింగ్, గంజాయి లాంటి డ్రగ్స్ వలన కలిగే అనర్థాల గురించి, ప్రజలకు ఫేక్ లోన్ యాప్స్, ఇన్వెస్ట్ మెంట్ లోన్ ఫ్రాడ్స్, ఓటీపీ మోసాలు మరియు ఇతర సైబర్ నేరాలపై విస్తృత అవగాహనా కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మరియు సిబ్బందిని ఆదేశించారు.
వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, వాహనాల నెంబర్ ప్లేట్లు యం.వి యాక్ట్ నిబంధనల ప్రకారం ఉండాలని, భయంకరమైన సౌండ్స్ వచ్చే మాడిఫైడ్ సైలెన్సర్లు, సైరన్స్ అమర్చి శబ్ద కాలుష్యం సృష్టించి, ప్రజలకు అసౌకర్యాన్ని, భయాన్ని కల్గిస్తే చర్యలు తప్పవని, ప్రతి వాహనదారుడు డ్రైవింగ్ లైసెన్సు, ఇన్సూరెన్స్ మరియు వాహన పత్రాలు కలిగి ఉండాలన్నారు.
ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా బాధితుల పట్ల తక్షణమే స్పందించాలని, ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో వుంటూ ఫిర్యాదులను పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ వెంట ఒంగోలు డి.ఎస్.పి ఆర్. శ్రీనివాసరావు ఒంగోలు వన్ టౌన్ సిఐ నాగరాజు మరియు సిబ్బంది ఉన్నారు.



