భక్త మార్కండేయ విరచిత శ్రీ చంద్రశేఖర అష్టకం పారాయణం సర్వవ్యాధి నివారణం అని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచకులు బ్రహ్మశ్రీ ఇనమనమెళ్లూరి మురళీ కృష్ణ తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శ్రీ కాశీవిశ్వేశ్వర స్వామి దేవస్థానం, పెదగంజాం గ్రామంలో ఏర్పాటు చేసిన మనగుడి కార్తికమాసోత్సవాలలో ప్రవాచకులు మురళీ కృష్ణ మాట్లాడుతూ మార్కండేయుడు అందించిన ఈ అష్టకం తనకు పరమేశ్వరునిపై గల అనన్య భక్తిని చాటుతుందని, ఎవరికైనా మృత్యుభీతిని తొలగిస్తుందని తెలిపారు. సత్య యుగమైన కృతయుగంలో జరిగిన యదార్థ గాథకు ప్రతిరూపమైన ఈ అష్టకం నేటి తరానికి కూడా అత్యావశ్యకం అని పేర్కొన్నారు. టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ ప్రోగ్రాం అసిస్టెంట్ ఆర్. రామకృష్ణ హిందూ ధర్మ పరిరక్షణలో తిరుమల తిరుపతి దేవస్థానముల సేవలను వివరించారు. తదనంతరం దేవాలయకమిటి అధ్యక్షులు ఏ. తిరుపతి రెడ్డి.భజనమండలి అధ్యక్షులు ఎన్. కోటిరెడ్డి తదితరులు ప్రవచకులు మురళీ కృష్ణ ను స్వామివారి శేషవస్త్రం తో ఘనంగా సత్కరించారు..
