ప్రజల నుండి వచ్చే వివిధ రకాల ఫిర్యాదులను పరిష్కరించేందుకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఏఆర్ దామోదర్ మరియు పోలీస్ అధికారులు ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టమ్) నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో వారి లిఖితపూర్వక అర్జీలతో వారి సమస్యల గురించి ధైర్యంగా జిల్లా ఎస్పీ మరియు పోలీస్ అధికారులుకు విన్నవించుకున్నారు. పోలీస్ అధికారులు ఫిర్యాదుదారులతో ముఖాముఖీగా మాట్లాడి వారి ఫిర్యాదుల పూర్వాపరాలను అడిగి తెలుసుకుని, వాటిని చట్టపరిధిలో త్వరితగతిన పరిష్కరిస్తామని భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో అందిన ఆయా ఫిర్యాదులపై పోలీస్ ఉన్నతాధికారులు సంబందిత పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడి వెంటనే చట్ట ప్రకారం విచారణ జరిపి భాదితులకు త్వరితగతిన న్యాయం అందించేలా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ కలహాలు, భర్త/అత్తారింటి వేధింపులు, చీటింగ్/జాబ్ ఫ్రాడ్, భూ వివాదాలు మరియు ఇతర సమస్యల గురించి ప్రజా పిర్యాదులు వచ్చాయి.
ఈ కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని….
తనకు సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తన వద్ద కావలి దగ్గర కచేరి మెట్టకు చెందిన ఒక వ్యక్తి రూ.1,10,000/- డబ్బులు తీసుకొని మోసం చేసినట్లు ఒంగోలు, పేర్నమిట్ట కు చెందిన ఒక బాధితుడు ఫిర్యాదు.
కొరిసపాడు మండలం, రావినూతలపాడు గ్రామానికి చెందిన ఒక వ్యక్తి టంగుటూరు మండలం, కాకుటూరివారి పాలానికి చెందిన ఒక రైతు వద్ద పచ్చాకు పని నిమిత్తం మేస్త్రి గా కాంట్రాక్ట్ గా ఒప్పందం చేసుకొని పనిచేసిన తరువాత కొంత డబ్బులు చెల్లించి మిగతా రూ.4,50,000/- డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని ఫిర్యాదు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె.నాగేశ్వరరావు, ఒంగోలు రూరల్ సీఐ యన్. శ్రీకాంత్ బాబు, ఒంగోలు ట్రాఫిక్ సీఐ పాండు రంగారావు, ప్యానెల్ అడ్వొకేట్ బివి.శివరామకృష్ణ, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎస్సైలు రజియా సుల్తాన్, ప్రభాకర్ రెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు.
