రహదారి ప్రమాదాల నివారణ లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాల మేరకు ఒంగోలు ట్రాఫిక్ సిఐ పాండు రంగారావు ఆధ్వర్యంలో ఆదివారం ఒంగోలు టౌన్ లో ట్రాఫిక్ పోలీసు అధికారులు, సిబ్బంది మరియు ప్రజలు హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించి, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ యొక్క ఆవశ్యకత గురించి అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ వై పాండు రావు మాట్లాడుతూ ……. హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితూ ఎక్కువ మంది తలకు గాయం కావడం వల్లే చనిపోతున్నారని, వాటి వలన ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, హెల్మెట్ ధారణతో ప్రమాదాల నుండి రక్షణ పొందవచ్చని, కావున ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తూ ప్రమాదాల నుండి తమను తాము కాపాడుకోవాలని సూచించారు. ప్రతి వాహనదారుడు డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, మైనర్లు వాహనాలు నడపరాదని, అతివేగం, ట్రిపుల్ రైడింగ్,సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదని హెచ్చరిస్తున్నారు. హెల్మెట్ ధరించని వారిపై కఠినంగా MV Act ప్రకారం జరిమానాలు విధించడం జరుగుతుందన్నారు. రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు తప్పక పాటించాలని, హెల్మెట్ ధరించటం ద్వారా మీ భద్రత మరియు మీ కుటుంబం యొక్క ఆనందం గురించి ఆలోచించాలని అధికారులు తెలియచేసారు.
ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీస్ అధికారులు, సిబ్బంది, రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ సిబ్బంది పాల్గొన్నారు.


