గంజాయి మరియు మాదక ద్రవ్యాల నియంత్రణలో పోలీసు యంత్రాంగంతో పాటు ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ. ఆర్ దామోదర్ అన్నారు. ప్రజా గాయకుడు నూక తోటి శరత్ బాబు డ్రగ్స్ పై రూపొందించిన ప్రత్యేక గీతాన్ని బుధవారం ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జిల్లా ఎస్పీ ఆవిష్కరించారు.
జిల్లా ఎస్పీ మాట్లాడుతూ …. గంజాయి మరియు మాదక ద్రవ్యాలకు యువత అలవాటు పడడం దురదృష్టకరమని, ఒక్కసారి డ్రగ్స్ సేవించడం మొదలు పెడితే వాటి నుండి బయటపడడం అంత సులువు కాదని, డ్రగ్స్ వాడకం మెదడుపై, మానసిక ఆరోగ్యం, అంతర్గత అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని, కొందరు మాదక ద్రవ్యాలకు బానిసలై దొంగతనాలు, చైన్ స్నాచింగ్ వంటి దొంగతనాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. యువత చెడు అలవాట్లకు, మాదక ద్రవ్యలకు దూరంగా ఉండాలని, ఎప్పుడు మంచి వాతావారణంలో ఉంటూ ఆరోగ్యవంతమైన జీవనాన్ని అలవాటు చేసుకోని జీవిత లక్ష్యాలను సాధించాలని సూచించారు. ఒకసారి డ్రగ్ కేసుల్లో పట్టుబడి పోలీసు రికార్డ్స్ లో పేరు నమోదు అయితే భవిష్యత్తులో ఉద్యోగాలు పొందలేరన్నారు. మాదక ద్రవ్యాలు వాడుట చట్ట రీత్యా నేరమని, ఎవరైనా సేవించినా, విక్రయించిన, రవాణా చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
డ్రగ్స్ నియంత్రణలో భాగంగా పోలీసు శాఖకు తో పాటు కళాకారులు పాటల ద్వారా సమాజాన్ని చైతన్య పరచాలని పేర్కొన్నారు. పరస్పర సహకారంతో మాదకద్రవ్య రహిత జిల్లాగా ప్రకాశం జిల్లాను మార్చవచ్చని పేర్కొన్నారు. గాయకుడు నూకతోటి శరత్ బాబు రూపొందించిన మత్తుపై యుద్ధం గీతాన్ని తమ సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేస్తామన్నారు. విద్యార్థులు మాదకద్రవ్యాల పట్ల ఆకర్షితులు కాకుండా చక్కగా చదువుకొని ఉన్నత స్ధానాలకు ఎదగాలని జిల్లా ఎస్పీ ఆకాంక్షించారు.
ఫేక్ ఎస్ఎంఎస్ లు, ఓటీపీ మోసాలు, బ్యాంకు నుండి అని ఫోన్లు, వాట్సప్ల ద్వారా వచ్చే ఫేక్ లింక్స్, ఫేక్ లోన్ యాప్స్, మీ కేవైసీ పెండింగ్ అని జరిగే మోసాలు, డిజిటల్ అరెస్ట్ అనగా పోలీస్, సిబిఐ, ఫెడెక్స్ కొరియర్ పేరుతో వచ్చే సైబర్ నేరాల ఫోను కాల్స్ ను నమ్మవద్దని, అటువంటి కాల్స్ కు ఎవ్వరూ స్పందించవద్దన్నారు. ఈ తరహా కాల్స్ వచ్చినపుడు నంబర్లును నోట్ చేసుకొని, 1930కు లేదా సైబర్ క్రైం పోర్టల్ లో ఫిర్యాదు చేయాలన్నారు.
కార్యక్రమంలో ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, ఒంగోలు డిఎస్పీ ఆర్ శ్రీనివాసరావు, ఒంగోలు టు టౌన్ సీఐ శ్రీనివాసరావు, ట్రాఫిక్ సీఐ పాండు రంగారావు, ఒంగోలు సిటిజన్ ఫోరం అధ్యక్షులు కొల్లా మధు, దుగ్గినేని వెంకట్రావు, ఏపీయూడబ్ల్యూజేఎఫ్ అధ్యక్షులు గొట్టిపాటి నాగేశ్వరరావు, ఏ జె సొల్యూషన్ ప్రియా, పేస్ NR ఒలింపియాడ్ స్కూల్ విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు.






