భూముల రీసర్వేలో నిర్లక్ష్యం ఉండకూడదని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. బుధవారం ఆమె కొత్తపట్నం మండలంలోని గాదెపాలెం గ్రామంలో పర్యటించారు. ఈ గ్రామంలో జరుగుతున్న రీసర్వేను పరిశీలించారు. ఈ గ్రామంలో 124 మంది రైతులకు చెందిన సుమారు 650 ఎకరాలను సర్వే చేశామని, విలేజ్ బౌండరీ కూడా సర్వే చేశామని, ప్రభుత్వ భూముల సర్వే 50% పూర్తయిందని అధికారులు తెలిపారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ…. ఎంతమంది రైతులకు సంబంధించిన భూములను ఈరోజు సర్వే చేశారు?.. ఎన్ని టీములు ఫీల్డ్ విజిట్లో ఉన్నాయి?… అని అధికారులను అడిగారు. నాలుగు టీములు ఫీల్డ్ లో పనిచేస్తున్నాయని, ఒక్కో టీముకు 20 ఎకరాల చొప్పున కేటాయించామని అధికారులు తెలిపారు. దీనితో ఆర్డీవో శ్రీమతి లక్ష్మీ ప్రసన్న ద్వారా ఇద్దరు రైతులకు ఫోన్ చేయించారు. ఎన్ని రోజుల ముందుగా సర్వేకు సంబంధించిన నోటీసులు ఇచ్చారు?… మీ సమక్షంలోనే భూములను సర్వే చేశారా?… అని ఆర్డివో ద్వారా ఆరా తీశారు. భూముల మ్యుటేషన్ విషయంలో నిబంధనలు ఉల్లంఘించరాదని అధికారులకు ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన రైతులతో కలెక్టర్ మాట్లాడారు.
ఈ పర్యటనలో కలెక్టర్ వెంట సర్వే శాఖ సహాయ సంచాలకులు శ్రీ.గౌస్ బాషా, తహసీల్దారు మధుసూదనరావు, మండల సర్వేయర్, ఇతర సిబ్బంది ఉన్నారు.


