స్కూల్ లలో సరైన సౌకర్యాలు, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటేనే విద్యార్ధులు చదువు పై శ్రద్ధ చూపగలరని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం ఆయన సనత్ నగర్ లోని నెహ్రూ పార్క్ సమీపంలో గల రౌండ్ టేబుల్ స్కూల్ ను వివిధ శాఖల అధికారులతో కలిసి సందర్శించారు. ఈ స్కూల్ లో ప్రైమరీ, హై స్కూల్ లకు చెందిన సుమారు 600 మంది వరకు విద్యార్ధులు ఉన్నారని, విద్యార్ధుల సంఖ్యకు తగినట్లు తరగతి గదులు లేవని ఎమ్మెల్యే కు స్కూల్ సిబ్బంది, విద్యార్ధుల తల్లిదదండ్రులు వివరించారు. సరిపడా తరగతి గదులు లేని కారణంగా చెట్ల క్రింద, షెడ్ల క్రింద విద్యార్ధులకు పాఠాలు బోధిస్తున్నట్లు తెలిపారు. స్పందించిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మేడ్చల్ జిల్లా కలెక్టర్ కు అక్కడి నుండే ఫోన్ చేసి రౌండ్ టేబుల్ స్కూల్ లో విద్యార్ధులకు సరిపడా తరగతి గదులు లేని కారణంగా ఆరుబయట పాఠాలు బోధించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, దీంతో విద్యార్ధులతో పాటు ఉపాద్యాయులు కూడా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలిపారు. ఈ సమస్య శాశ్వత పరిష్కారం కోసం రౌండ్ టేబుల్ స్కూల్ కు సమీపంలో నిరుపయోగంగా ఉన్న ఈ ఎస్ ఐ కి చెందిన స్థలంలో నూతన భవనం నిర్మించి ప్రైమరీ స్కూల్ ను ఇందులో కి మార్చాల్సి ఉంటుందని తెలిపారు. ఇందుకు గాను 40 లక్షల రూపాయలతో ప్రైమరీ స్కూల్ భవన నిర్మాణం పనులు చేపట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మేడ్చల్ కలెక్టర్ ను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ య్ యాదవ్ కోరారు.
*హాస్పిటల్ నిర్మాణం చేపట్టాలి*…తలసాని
సనత్ నగర్ లోని ఎస్ ఆర్ టి లో అన్ని సౌకర్యాలతో కూడిన నూతన హాస్పిటల్ నిర్మించాల్సిన అవసరం ఉన్నదని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం సనత్ నగర్ లో పర్యటించిన సందర్బంగా ఎస్ ఆర్ టి లో ఉన్న డిస్పెన్సరీ కి వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, అందుకు తగిన విధంగా సౌకర్యాలు కూడా కల్పించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ఆయన వెంటనే జిహెచ్ఎంసి కమిషనర్ ఇలంబర్తి కి ఫోన్ చేసి డిస్పెన్సరీ కి పక్కనే జీ హెచ్ ఏం సి.కి చెందిన స్థలం ఉన్నదని, ఆ స్థలాన్ని వైద్య ఆరోగ్య శాఖకు కేటాయించే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. హాస్పిటల్ భవన నిర్మాణం కు అవసరమైన నిధులు 1.43 కోట్ల రూపాయలు ఇప్పటికే మంజూరై ఉన్నాయని వివరించారు. నూతన హాస్పిటల్ భవనం నిర్మిస్తే మరింత మెరుగైన వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఎమ్మెల్యే వెంట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకట్, ఎంఈఓ హరిచంద్ర, కార్పొరేటర్ కొలన్ లక్ష్మి బాల్ రెడ్డి, వాటర్ వర్క్స్ జిఎం హరి శంకర్, ఏ ఎమ్ ఓ హెచ్ చంద్రశేఖర్ రెడ్డి, స్కూల్ ప్రధానోపాధ్యాయుడు బ్రహ్మచారి, డివిజన్ బి ఆర్ ఎస్ పార్టీ అద్యక్షుడు కొలన్ బాల్ రెడ్డి, నాయకులు ఖలీల్, సురేష్ గౌడ్, శేఖర్, ఫాజిల్, జమీర్, పుష్పాలత తదితరులు ఉన్నారు.
*సెల్ టవర్ తొలగించాలని ఎమ్మెల్యే కు వినతి*
సనత్ నగర్ లోని ఎస్ ఆర్ టి 707 లో నూతనంగా ఏర్పాటు చేసిన సెల్ ఫోన్ టవర్ ను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కోరారు. సోమవారం సనత్ నగర్ పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కాలనీ వాసులు కలిసి వినతిపత్రం అందజేశారు. తాము మొదటి నుండి కోరుతున్నా అధికారులు పట్టించుకోకుండా సెల్ ఫోన్ టవర్ ను ఏర్పాటు చేశారని, దీని వలన తాము అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆవేదన్ వ్యక్తం చేశారు. స్పందించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ జీ హెచ్ ఏం సి కమిషనర్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్ళి టవర్ తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.




