కొనకనమిట్ల మరియు పొదిలి పోలీస్ స్టేషన్ లను గురువారం జిల్లా ఎస్పీ ఆకస్మికంగా సందర్శించి, తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీలలో భాగంగా స్టేషన్ పరిసరాలను, విధుల్లో ఉన్న సిబ్బంది పనితీరు, డ్యూటీల కేటాయింపు, మహిళ సహాయక కేంద్రం, ఫిర్యాదుల స్వీకరణ విధానం మరియు తదితర అంశాలను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతలు పరిరక్షణ, నేర నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై, ఇతర ప్రాధాన్యత గల విషయాలపై ఆరా తీసి పలు సూచనలు చేసారు. స్టేషన్లో పెండింగ్ కేసులపై దృష్టి సారించి త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పోలీసు స్టేషన్ కు ఫిర్యాదు చేయుటకు వచ్చే ఫిర్యాదులుదారులు పట్ల మర్యాదపూర్వకంగా మాట్లాడి వారి యొక్క సమస్య తెలుసుకొని వెంటనే విచారణ చేసి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు ఎస్పీ గారు సూచించారు. నేరాలు నియంత్రణకు సి.సి/డ్రోన్ కెమెరాల ఏర్పాటు ఆవశ్యకతను తెలియచేస్తూ ప్రజలకు అవగాహన కల్పించాలని, వీలైనంత తక్కువ సమయంలో సి.సి కెమెరాలను అమర్చుకునేలా చూడాలన్నారు. అలాగే పొదిలి పట్టణంలో నిర్మాణంలో ఉన్న పొదిలి పోలీస్ సర్కిల్ నూతన కార్యాలయ భవనాన్ని జిల్లా ఎస్పీ సందర్శించి, నిర్మాణ పనుల్లో నాణ్యతను పరిశీలించి పలు సూచనలు చేసారు.
అనంతరం మహాశివరాత్రి మహోత్సవాల్లో భాగంగా పొదిలిలోని శ్రీ పార్వతీ దేవి సమేత నిర్మమహేశ్వరరావు స్వామి దేవస్థానం నందు రథోత్సవం సందర్బంగా గురువారం జిల్లా ఎస్పీ ఆలయాన్ని దర్శించుకొని, ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. తరువాత ఆలయ పరిసరాలు, దర్శనానికి వెళ్లే ప్రవేశ, ఎగ్జిట్ క్యూలైన్లు, రథోత్సవం జరిగే మార్గాల వద్ద భద్రతా మరియు బందోబస్తు పై అధికారులకు పలు సూచనలు తెలియచేసినారు. దర్శనానికి భారీ సంఖ్యలో విచ్చేసే భక్తులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయాల వద్ద పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాట్లు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని, వాహన రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టాలన్నారు.
పోలీస్ సిబ్బంది అందరూ విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని, వేడుకల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రతి ఒక్కరు ఎవరికి నియమించిన స్థానంలో ఉంటూ భక్తులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి రథోత్సవం జరిగే సమయంలో ఎలాంటి తోపులాట్లు, అవాంతరాలు జరగకుండా రథోత్సవం వేడుక విజయవంతంగా ముగిసేలా సమన్వయం, సమయస్ఫూర్తి తో విధులు నిర్వర్తించాలని సిబ్బందికి జిల్లా ఎస్పీ సూచించారు. రథోత్సవం జరిగే ప్రాంతంలో సిసి/డ్రోన్ కెమెరాల నిఘా ఏర్పాటు చేశామన్నారు.
జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్
వెంట అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె. నాగేశ్వరరావు, దర్శి డిఎస్పి లక్ష్మీనారాయణ, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, పొదిలి సిఐ వెంకటేశ్వర్లు, పొదిలి ఎస్సై వేమన, తర్లుపాడు ఎస్సై బ్రహ్మనాయుడు మరియు సిబ్బంది ఉన్నారు.












