మార్చి 4 నుండి 9 తేదీ వరకు బెంగుళూరులో 45 వ నేషనల్ మాస్టర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ -2025 పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రకాశంజిల్లా పోలీస్ శాఖ తరపున 30 ప్లస్ ఏజ్ గ్రూప్ విభాగంలో పోలీసులు వివిధ విభాగాలలో తమ ప్రతిభను చాటుకున్నారు. నేషనల్ మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని విశేష ప్రతిభ కనబరిచి పలు పతకాలు కైవసం చేసుకున్న ఆర్ఎస్ఐ సురేష్ మరియు కానిస్టేబుల్ లను జిల్లా ఎస్పీ ఏ. ఆర్ దామోదర్ మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించి సర్టిఫికెట్స్ మరియు మెడల్స్ ను అందచేసినారు. నేషనల్ అథ్లెటిక్స్ పోటీలలో పతకాలు సాధించిన ఏ ఆర్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఆర్ఎస్ఐ సురేష్ 100M, 200M పరుగు లలో 2 సిల్వర్ మెడల్స్, 4×100, 4x 400 మీటర్ల రిలే లో 2 బ్రాంజ్ మెడల్స్ మరియు కె.శ్రీనివాసరావు (PC.973) 4X100, 4X400 మీటర్ల రిలే లో రెండు బ్రాంజ్ మెడల్స్ సాధించారు.
ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ ఏ. ఆర్ దామోదర్ మాట్లాడుతూ… అంకితభావం, పట్టుదల, కృషి ఫలితంగానే ఈ విజయం సాధ్యమైందని, ఒకవైపు పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తూనే మరోవైపు క్రీడల పట్ల ఆసక్తితో నిరంతరం ప్రాక్టీస్ చేస్తూ పతకాలు సాధించి ప్రకాశం జిల్లా పోలీస్ శాఖ ఖ్యాతిని ఇనుమడింపజేయడం గొప్ప విషయమన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయన్నారు. క్రీడల్లో పాల్గొనడం వలన క్రమశిక్షణ, సమయపాలన, పోటీతత్వం వంటి లక్షణాలు అలవడతాయని, విధి నిర్వహణలో ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయన్నారు. జిల్లా పోలీస్ శాఖలో ప్రతిభ గల పోలీస్ సిబ్బంది క్రీడలలో పాల్గొనాలన్నారు. క్రీడలలో వారికి ప్రోత్సాహం అందిస్తూ అన్ని విధాలా సహకారం అందిస్తామన్నారు. వారితో భవిష్యత్తులో కూడా మరిన్ని విజయాలు సాధించాలని, పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు, ఐటి కోర్ సీఐ సూర్యనారాయణ, ఆర్ఐ రమణారెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు.


