ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్ దామోదర్ ఆదేశాల మేరకు జిల్లాలోని పోలీస్ అధికారులు మరియు సిబ్బంది కలసి జిల్లాలో పదో తరగతి పరీక్షలు జరుగుతున్న పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు.
పరీక్షల సమయంలో అత్యవసర పరిస్థితులు ఎదురైతే సహాయం చేయడానికి జిల్లా ఎస్పీ ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక టీమ్ లు ఏర్పాటు చేయటం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు బుధవారం మార్కాపురం పట్టణంలో 9 గంటలకే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్న సమయంలో ఓ విద్యార్థి మాత్రం గర్ల్స్ ప్రభుత్వ హైస్కూల్ లో పరీక్ష రాయాల్సి ఉండగా పొరపాటున బాయ్స్ జడ్పీహెచ్ స్కూల్ పరీక్ష కేంద్రానికి వచ్చింది. అక్కడికి వచ్చి చెక్ చేసుకోగా పరీక్ష కేంద్రం ఇక్కడ కాదని తెలియడంతో కంగారు పడి పరుగులు పెట్టడంతో పరీక్షా కేంద్రం విధులు నిర్వహిస్తున్న మార్కాపురం ట్రాఫిక్ ఎస్సై అహరోను గమనించి ఆ విద్యార్థిని తన వాహనంపై పరీక్ష కేంద్రానికి సమయానికి చేర్చి పరీక్ష రాసేలా చేశారు. పరీక్షా కేంద్రంలో విద్యార్థిని దించడంతో అక్కడున్న విద్యార్థులతోపాటు విద్యార్థిలు ప్రత్యేక పోలీస్ టీమ్ లు ఏర్పాటు చేసినందుకు జిల్లా ఎస్పీ కి మరియు సకాలంలో స్పందించిన ఎస్సై కి కృతజ్ఞతలు తెలియజేసారు.
పరీక్ష వ్రాసే విద్యార్థులు ఎలాంటి సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రాలలోనికి తీసుకెళ్లకుండా క్షణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ, పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో పరీక్షలు జరిగే సమయంలో జిరాక్స్ సెంటర్లు మూసివేసే విధంగా చర్యలు తీసుకున్నారు. పరీక్షా సమయంలో ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూస్తున్నారు. ప్రతిరోజు పరీక్ష పూర్తయ్యేవరకు సిబ్బంది అందరు అప్రమత్తంగా విధులు నిర్వర్తిస్తూ పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా జరగడానికి పోలీస్ శాఖ తరఫునుండి అన్ని చర్యలు తీసుకుంటున్నారు.


