దేశ శాంతి భద్రతలో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం ప్రముఖ పాత్ర పోషిస్తుందని, సురక్షిత తీరం, తీర ప్రాంత పరిరక్షణకు ప్రజలను మమేకం చేసేందుకే లక్ష్యంగా చేపట్టిన సైకిల్ ర్యాలీ అభినందనీయమని జిల్లా ఎస్పీ
ఏ.ఆర్ దామోదర్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయం నుండి (సిఐఎస్ఎఫ్) సముద్ర తీర సైకిల్ ర్యాలీని ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్ దామోదర్ మరియు సిఐఎస్ఎఫ్ సీనియర్ కమాండెంట్ సంజీత్ కుమార్ లు జెండా ఊపి ప్రారంభించారు. ముందుగా సముద్ర మార్గం ద్వారా ఉగ్రవాదులు రాకుండా, మాదక ద్రవ్యాల రవాణా సాగకుండా చూడటంలో తీర ప్రాంత ప్రజలు కీలకంగా ఉండాలని ఆకాంక్షిస్తూ సీఐఎస్ఎఫ్ జవాన్లు చేపట్టిన సైకిల్ ర్యాలీ శనివారం ఉదయం ఒంగోలు జిల్లా పోలీస్ కార్యాలయమునకు చేరుకుంది. జవాన్లకు పోలీసులు, ఎన్. సి. సి విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ర్యాలీలో పాల్గొన్న సిఐఎస్ఎఫ్ సిబ్బందిని జిల్లా ఎస్పీ ఏ.ఆర్ దామోదర్ అభినందిస్తూ వారు చూపుతున్న దేశభక్తి, అంకితభావం ప్రశంసనీయమన్నారు.
జిల్లా ఎస్పీ ఏ.ఆర్ దామోదర్ మాట్లాడుతూ….. సిఐఎస్ఎఫ్ దేశం నలుమూలల అంతర్గత పరిరక్షణలో ప్రముఖ పాత్ర పోషిస్తుందని, దేశంలో అత్యున్నత ప్రమాణాలతో భద్రతను అందిస్తున్న పారా మిలటరీ దళం సిఐఎస్ఎఫ్ అని, సముద్ర తీర ప్రాంత ప్రజలలో దేశభద్రత, సమైక్యతను పెంపొందించి దేశ, రాష్ట్ర, జిల్లా ప్రజలను సిఐఎస్ఎఫ్ సిబ్బందితో మమేకం చేస్తూ ర్యాలీ చేపట్టడం గొప్ప విషయమన్నారు. దారి పొడవునా తీరంలో ఉన్న ప్రజలకు వీరు భద్రతపై అవగాహన కల్పిస్తూ మార్చి 7 న కొలకత్తా సమీప బక్కలి, వెస్ట్ బెంగాల్ నుంచి ఈ ర్యాలీ మొదలైందని మార్చి 31న కన్యాకుమారి చేరుకుంటుందన్నారు. సముద్రతీరాన్ని రక్షించడం సిఐఎస్ఎఫ్ ఒకరిదే బాధ్యత కాదని, ప్రజలందరి బాధ్యత కూడా ఉందన్నారు. ప్రజలను భాగస్వామ్యులుగా చేయాలనే ఉద్దేశంతో సిఐఎస్ఎఫ్ బృహత్తర కార్యక్రమం చేపట్టిందన్నారు.
ఈ సందర్భంగా సీనియర్ కమాండెంట్ సంజీత్ కుమార్ మాట్లాడుతూ….. 50 మందితో ఈ సైకిల్ ర్యాలీని చేపట్టామన్నారు. 6,553 కిలోమీటర్ల ప్రయాణించి ఈనెల మార్చి 31వ తేదీకి కన్యాకుమారికి చేరుకుంటామన్నారు. సంఘ విద్రోహ శక్తులకు తీరప్రాంత గ్రామాల నుంచి చొరబాటులు ఉండకూడదని ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గుజరాత్ లోని వెస్ట్ కోస్టు లక్పత్ పోర్టు నుంచి 50 మంది, కొలకత్తా నుంచి 50 మంది సైకిలిస్టులు ఇరువైపుల నుంచి కన్యాకుమారి చేరుకుంటారన్నారు. ఇప్పటి వరకు 16 రోజులు సైకిల్ ర్యాలీ ద్వారా ప్రయాణించినట్లు వారు తెలిపారు. ఈ ర్యాలీలో 14 మంది మహిళ జవాన్లులు కూడా ఉన్నారు.
ఈ కార్యక్రమంలో సిఐఎస్ఎఫ్ సీనియర్ కమాండెంట్ సంజీత్ కుమార్, అసిస్టెంట్ కమాండెంట్ విక్రమ్ సింగ్, ఎఎస్పీ (అడ్మిన్) కె.నాగేశ్వరరావు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు, ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, ఏఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు, ఎస్ బి ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, ఐటి కోర్ సీఐ సూర్యనారాయణ, ఒంగోలు టౌన్ సీఐలు నాగరాజు, అజయ్ కుమార్, శ్రీనివాసులు, ఒంగోలు ట్రాఫిక్ సీఐ పాండు రంగారావు, ఆర్ఐలు సీతారామి రెడ్డి, రమణారెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు.










