రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని రంజాన్ ఉపవాసాల సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీసు కల్యాణ మండపంలో ఆదివారం ముస్లిం పోలీసు సిబ్బందికి ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఏ.ఆర్ దామోదర్ హాజరై, ఇఫ్తార్ విందును స్వీకరించారు. మౌజన్ ఎస్.కె అబ్దుల్లా ప్రార్థన చేయించి, అల్లా దీవెనలు పొందాలని ఆకాంక్షించారు.
జిల్లా ఎస్పీ ఏ.ఆర్ దామోదర్ మాట్లాడుతూ …. ఇఫ్తార్ విందు మత సామరస్యాన్ని చాటిందని, ఈ విందులో ముస్లిం పోలీసు అధికారులు , సిబ్బందితో పాటు ఇతర పోలీసు అధికారులు సైతం పాల్గొన్నారన్నారు. ముస్లిం సోదరులతో కలసి ఇఫ్తార్ విందులో పాల్గొనటం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. పండుగ అనేది ఏ మతానికి సంబంధించినది అయినా దాని వెనక ఒక సందేశం దాగి ఉంటుందని, ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగ సైతం ఇదే హితాన్ని మానవాళికి బోధిస్తుందని తెలిపారు. ముస్లిం సోదరులు రంజాన్ మాసం అంతా భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారని, పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఆచరించే ముస్లిం సోదరులకు ఇచ్చే ఇఫ్తార్ విందు లాంటి కార్యక్రమాలు ప్రజలలో సోదర భావాన్ని పెంపొందిస్తాయన్నారు. రంజాన్ మాసం త్యాగానికి, దానధర్మాలకు, దైవచింతనకు ప్రతీక అని, ఈ మాసంలో ఉపవాస దీక్షలు, ప్రార్థనలు చేయడం ద్వారా మనలోని చెడు ఆలోచనలను, అలవాట్లను విడిచిపెట్టి మంచి మార్గంలో నడవడానికి దోహదం చేస్తుందన్నారు. ఉపవాసాలు ఉండే ముస్లింలు వేసవి కాలంలో తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రజలు అన్ని పండుగలను ప్రశాంత వాతావరణంలో కలిసి మెలిసి ఆనందోత్సవాల మధ్య నిర్వహించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏఎస్పీ (అడ్మిన్) కె.నాగేశ్వరరావు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు, ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, ఏఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు, ఎస్ బి ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, ఆర్ఐలు సీతారామి రెడ్డి, రమణారెడ్డి, సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.







