తొలి తెలుగు వాగ్గేయకారుడు పదకవితా పితామహుడు శ్రీ తాళ్ళపాక అన్నమయ్య 522 వ వర్ధంతి సభ శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య సంగీత సాహిత్య సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక సంతపేట షిరిడి సాయిబాబా మందిరం లోని అన్నమయ్య విగ్రహ సన్నిధి లో అత్యంత వైభవంగా జరిగింది.
ఈ సందర్భంగా సమితి అధ్యక్షుడు ఐ. మురళీ కృష్ణ మాట్లాడుతూ కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుని 32వేల సంకీర్తనలతో సేవించి తరించిన పరమభాగవత శిఖామణి అన్నమయ్య అని శ్లాఘించారు. ఈ సందర్భముగా దాదాపు 600 అన్నమయ్య కీర్తనలను స్వర కల్పన చేసి అన్నమయ్య మానస పుత్రుడైన అభినవ అన్నమాచార్యులు ఇటీవల స్వర్గస్తులైన స్వర్గీయ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ సంగీత సాహిత్య సేవలను కొనియాడుతూ వారి గాత్రం అజరామరమని కీర్తించారు. ప్ర ర సం అధ్యక్షులు పొన్నూరు వేంకట శ్రీనివాసులు మాట్లాడుతూ..అన్నమయ్య విరచిత సంకీర్తనలు లలితసుమధురమై తెలుగు సాహితీ రంగాన స్థిరమై నిలిచాయన్నారు. గరిమెళ్ళ వారి మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు అని పేర్కొన్నారు. విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు తూనుగుంట మల్లిఖార్జునరావు మాట్లాడుతూ..అన్నమయ్య గొప్ప సామాజిక దార్శనికుడు అని శ్లాఘించారు. కార్యక్రమం లో భాగంగా దేవస్థాన అర్చకులు సుధాకర్ స్వామి అధ్యర్యంలో విశేష పూజలు అభిషేకాలు నిర్వహించారు.
సాం స్కృతిక కార్యక్రమాలలో భాగంగా జరిగిన సంగీత విభవారిలో గాయకులు మా మూర్తి, గుర్రం కృష్ణ, బదరీ రంగనాథ్, ఆకుల శ్రీను, ఈదుల చిన్ని కృష్ణ, వేంకట సుబ్బయ్య తదితరులు ఆలపించిన కీర్తనలు అలరించాయి.
కార్యక్రమములో వివిధ సాంస్కృతిక సంస్థల ప్రతినిధులు డాక్టర్ ఆర్. ప్రసాద రావు, డి. ప్రసన్న కుమారి, పి. జానకి రామ్, ఒ. ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

