రిలయన్స్ ఆధ్వర్యంలో కనిగిరి ప్రాంతంలో ఏర్పాటు చేయబోయే మొదటి కంప్రెస్డ్ బయో గ్యాస్ (సీబీజీ) ప్లాంట్ కు సంబంధించి ఏప్రిల్ 2వ తేదీ జరిగే శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్, రిలయన్స్ అనంత్ అంబానీలు సంయుక్తంగా పాల్గొంటారని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. సీబీజీ ప్లాంట్ శంకుస్థాపన ఏర్పాట్లను సోమవారం ప్రత్యేకంగా పర్యవేక్షించిన ఆయన., అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనతో పాటు రైతుల ఆర్థిక స్థితి మెరుగు పరచడానికి అనేక చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. ఇందులో భాగంగానే నిరుపయోగంగా ఉన్న భూములను సీబీజీ ప్లాంట్ల నిర్మాణంలో భాగస్వామ్యం చేస్తున్నామని తెలిపారు. కౌలుకు ఇచ్చినా రూ. 4, 5 వేలు మాత్రమే వచ్చే భూములతో పాటు… వేసిన పంట చేతికి కూడా రాని భూములను ఇందుకోసం గుర్తించినట్లు మంత్రి వివరించారు. ఇటువంటి భూములను కౌలుకు ఇస్తే రైతుకు రూ.31 వేలు, ప్రభుత్వ భూములకు రూ.15 వేలు వరకు ఆదాయం వస్తుందని తెలిపారు. కౌలుకు ఇవ్వక పోయినా ప్లాంట్ కు అవసరం అయిన గడ్డిని పండించి ఇచ్చినా… అన్నదాతకు ఆర్థిక లాభం కలుగుతుందని పేర్కొన్నారు. అదే విధంగా ప్లాంట్ చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలకు ఉపాధి కలుగుతుందని మంత్రి గొట్టిపాటి తెలిపారు.
500 ప్లాంట్లతో వేలాది మందికి ఉపాధి… వలసలు తగ్గుముఖం..
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుపయోగమైన భూముల్లో సుమారు 500 సీబీజీ ప్లాంట్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. ప్రస్తుతం కనిగిరి ప్రాంతంలో 100 టన్నుల కెపాసిటీతో ప్లాంట్ నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. ప్లాంట్ల నిర్మాణానికి సుమారు 5,000 ఎకరాలను కేటాయించామన్నారు. కనిగిరితో పాటు గిద్దలూరు, మార్కాపురం, దర్శితో పాటు కొండెపిలోనూ ప్లాంట్ల నిర్మాణాలను చేపడతామన్నారు. 20 టన్నుల కెపాసిటీ కలిగిన ఒక్కో సాధారణ ప్లాంట్ నిర్మాణంతో సుమారు 250 నుంచి 500 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభిస్తుందని మంత్రి గొట్టిపాటి తెలిపారు. దీనితో పనులు లేక ఆర్థిక ఇబ్బందులతో వలసలు వెళ్లే అవసరం ఆ ప్రాంత ప్రజలకు ఇకపై తగ్గుతుందని చెప్పారు. మొత్తం ప్లాంట్ల నిర్మాణాలన్నీ పూర్తయితే వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించడంతో పాటు, రైతులకూ ఆర్థిక లాభం కలుగుతుందన్నారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో సీబీజీ ప్లాంట్ల నిర్మాణాలను కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు. ఏప్రిల్ 2న జరగబోయే ప్లాంట్ శంకుస్థాపన ఏర్పాట్ల పరిశీలన కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటితో పాటు ఎమ్మెల్యేలు ఉగ్రనరసింహారెడ్డి, అశోక్ రెడ్డి, పలువురు అధికారులు, కూటమి నేతలు పాల్గొన్నారు.


