రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూడాలని జిల్లా కలెక్టరు ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. వీరికి అవసరమైన తాత్కాలిక వసతి, అల్పాహారం అందించేందుకు విష్ణు ప్రియ కళ్యాణ మండపం, క్విజ్, రైజ్ కాలేజీలలో చేస్తున్న ఏర్పాట్లను జాయింట్ కలెక్టరు ఆర్. గోపాల కృష్ణతో కలిసి గురువారం ఆమె పరిశీలించారు. అన్నమయ్య జిల్లా నుంచి 30 బస్సులలో 1500 మంది, కడప నుంచి 70 బస్సులలో 3000 మంది, తిరుపతి నుంచి 70 బస్సులలో 3000 మంది అమరావతికి వెళ్తున్నందున శుక్రవారం తెల్లవారు ఝామున వీరు ఒంగోలుకు చేరుకుంటారు. కొంత విశ్రాంతి అనంతరం అల్పాహారం తిని అమరావతికి బయలుదేరి వెళతారు.
అదే విధంగా ఒంగోలు మండలం నుంచి 2500 మంది, కొత్తపట్నం మండలం నుంచి 500 మంది మొత్తం 60 బస్సులలో వెళ్తారు. వీరి కోసం మినీ స్టేడియంలో బస్సులను, అల్పాహార ఏర్పాట్లను జిల్లా అధికారులు చేసారు. అల్పాహారంలో పులిహోర, అరటి పండు, వాటర్ బాటిల్స్ – 2, మజ్జిగ ,ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ను అధికారులు సిద్ధం చేశారు. ప్రణాళిక ప్రకారం సకాలంలో బస్సులు బయలుదేరి వెళ్ళేలా చూడాలని ఒంగోలు ఆర్డీవో లక్ష్మి ప్రసన్న, ఇతర అధికారులను కలెక్టరు ఆదేశించారు.

