గ్రీవెన్స్ ఆర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని ఎంతమాత్రం సహించబోనని జిల్లా కలెక్టరు ఏ. తమీమ్ అన్సారియా స్పష్టం చేసారు. సమస్యల పరిష్కారం కోసం అర్జీదారులను ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటే ఊరుకోబోనని అధికారులను హెచ్చరించారు. వారి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని గ్రీవెన్స్ హాలులో నిర్వహించిన “మీ కోసం” కార్యక్రమంలో జాయింట్ కలెక్టరు ఆర్.గోపాలకృష్ణ తో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” లో వచ్చే ఆర్జీల పై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టరు ఆదేశించారు. “మీ కోసం” కార్యక్రమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో అర్జీదారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నందున ప్రతి ఒక్క అర్జీ పై ప్రత్యేక శ్రద్ద పెట్టి, వాటికి అర్థవంతమైన సమాధానం ఇస్తూ పరిష్కారం చూపాలని అధికారులకు దిశానిర్దేశం చేసారు. వచ్చిన ఆర్జీలను నిర్దేశించిన గడువులోపు పరిష్కరించాలని, ఎట్టి పరిస్థితిల్లోనూ అర్జీలు రీఓపెన్ కాకుండా చూడాలని ఆమె ఆదేశించారు. అధికారులు ప్రతి రోజు లాగిన్ అయి ఆన్ లైన్ లో వచ్చిన వినతులను చూడాలని ఆమె చెప్పారు. సాంకేతిక సమస్యల వలన క్షేత్రస్థాయిలో పరిష్కరించలేని అర్జీలు వస్తే ఆ విషయాన్ని ప్రజలకు అప్పుడే స్పష్టం చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటి కలెక్టర్లు శ్రీధర్, కుమార్, జాన్సన్, డిప్యూటి కలెక్టర్ పార్ధసారధి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


