వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఎరుకుల్లా రామకృష్ణ , వైస్ ప్రెసిడెంట్ శిద్ధా వెంకట సూర్య ప్రకాష్ రావు మరియు ఇతర సభ్యుల ఆధ్వర్యంలో, ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ చొరవతో, జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జాతీయ పతాక ప్రదర్శన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ , ఒంగోలు మేయర్ గంగాడ సుజాత , ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక ప్రజలు మరియు వివిధ పాఠశాలలు మరియు కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా పోలీస్ గ్రౌండ్ నుంచి అద్దంకి బస్టాండ్ వరకు సుమారు 3600 అడుగుల పొడవైన జాతీయ జెండాతో బుధవారం ఈ ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్బంగా ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ మన జాతీయ జెండాను తెలుగు వారైన పింగళి వెంకయ్య రూపొందించడం మనకు గర్వకారణమని, మన ఆంధ్ర ప్రాంతానికి చెందిన మహోన్నత వ్యక్తికి ఇలాంటి గొప్ప ఘనత దక్కిందని, త్రివర్ణ పతాకాన్ని చూస్తేనే.. మనలో సహజంగానే దేశభక్తి, గర్వం ఉరకలేస్తాయని, మన గ్రామం, మన మండలం, జిల్లా, రాష్ట్రం, దేశం, తల్లిదండ్రులు ఎలాగో మన త్రివర్ణ పతాకం అన్నా కూడా మనకు మంచి స్ఫూర్తి కలుగుతుందని అన్నారు. శాంతి, సహనం, అహింస అనే తత్వాన్ని మన జాతీయ జెండా చాటి చెబుతుందని చెప్పారు. జాతీయ భావనను, సమైక్యతను పెంపొందించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషదాయకామని అన్నారు. 3600 అడుగుల పొడవున్న జాతీయ జెండాతో ఒంగోలు నగరంలో నిర్వహించిన ర్యాలీ జిల్లా ప్రజల గర్వకారణంగా నిలిచిందని, మువ్వన్నెల పతాకం రెపరెపలాడుతూ నగరాన్ని ముస్తాబుగా మార్చిందన్నారు.
అనంతరం జిల్లా ఎస్పీ హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతూ ఎక్కువ మంది తలకు గాయం కావడం వల్లే చనిపోతున్నారని, వాటి వలన ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, హెల్మెట్ ధారణతో ప్రమాదాల నుండి రక్షణ పొందవచ్చని, కావున ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించాలని, ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారికి రక్షణ కవచంలా హెల్మెట్ ఉంటుందని, తల్లి జన్మనిస్తే హెల్మెట్ పునర్జన్మనిస్తుందన్నారు. హెల్మెట్ ధరించటం ద్వారా మీ భద్రత మరియు మీ కుటుంబం యొక్క ఆనందం గురించి ఆలోచించాలన్నారు. వారి కుటుంబసభ్యులు బైక్ మీద వెళ్లేటప్పుడు రహదారి భద్రత నియమాలు పాటిస్తూ తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకొని వెళ్ళమని చెప్పాలని విద్యార్థులు మరియు వాహనదారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్)కె.నాగేశ్వరరావు, ఒంగోలు మున్సిపల్ కమిషనర్ కె.వెంకటేశ్వరరావు, ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, ఎఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు, ఒంగోలు తాలూకా సీఐ విజయకృష్ణ, ఒంగోలు వన్ టౌన్ సీఐ నాగరాజు, ఒంగోలు టు టౌన్ సీఐ యం. శ్రీనివాసరావు, ట్రాఫిక్ సీఐ పాండు రంగారావు, విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు.





