రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్దిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి చెప్పారు. ముఖ్యమంత్రి సహాయ నిధి (సి.ఎం.ఆర్.ఎఫ్) నుంచి చేస్తున్న సహాయమే దీనికి నిదర్శనమని ఆయన అన్నారు. ఆదివారం టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలోని తన నివాసంలో 83 మంది లబ్ధిదారులకు రూ.59,25,059 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఆరు ఎల్.ఓ.సి.ల రూపంలో రూ.12,25,000 ఆర్థిక ప్రయోజనం కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన అప్పులు, వాటికి వడ్డీలు చెల్లించడం తమ ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉన్నప్పటికీ వైద్యం కోసం ఖర్చు చేసుకున్న ప్రజలకు సహాయం చేయటానికి ఎల్లవేళలా ముందు ఉంటున్నట్లు చెప్పారు. తమ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు కొండపి నియోజకవర్గంలో రూ.4.4 కోట్ల ఆర్థిక సహాయం అందించామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 400 కోట్ల రూపాయలను ఈ విధంగా ప్రభుత్వం సహాయం చేసిందన్నారు. మరోవైపు వైద్య రంగాన్ని బలోపేతం చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి చెప్పారు. ప్రభుత్వాసుపత్రులలో సిబ్బందిని నియమించి సౌకర్యాలను మెరుగుపరుస్తున్నట్లు తెలిపారు. గుండెపోటు వచ్చిన వెంటనే స్టెమీ ద్వారా మారుమూల ప్రాంతాల్లోనూ ప్రజల ప్రాణాలను కాపాడుతున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు పెంచేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా మార్చేందుకు ప్రభుత్వం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయమే దీనికి నిదర్శనమని అన్నారు.
పొగాకు రైతులతో చర్చలు…
స్థానికంగా ఉన్న పలువురు పొగాకు రైతులు కూడా ఈ సందర్భంగా మంత్రిని కలిశారు. పూర్తిస్థాయిలో గిట్టుబాటు ధరకు పొగాకు కొనుగోలు చేసేలా చూడాలని వారు కోరారు. దీనిపై మంత్రి స్పందిస్తూ రైతులెవరికీ నష్టం రాకుండా చూస్తామని హామీ ఇచ్చారు.

