పాతనగరంలో మెట్రో రైల్ మార్గం విస్తరణ పనులు వేగవంతం…పిల్లర్ల మార్కింగ్ ప్రారంభంరోజువారీగా సమీక్షిస్తున్నమెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి.

హైదరాబాద్ ఆగస్ట్ 3(జే ఎస్ డి ఎం న్యూస్) :
ఎంజీబీఎస్ నుండి చంద్రాయన్ గుట్ట మధ్య మెట్రో రైల్ కారిడార్ ఏర్పాటుకు సంబంధించిన రోడ్ విస్తరణ పనులు వేగవంతం అయ్యాయి. ఏడున్నర కిలోమీటర్ల మార్గంలో అలైన్మెంట్ అద్భుతంగా ఉండేలా చర్యలు చేపట్టామని, ఈ మార్గంలో రోడ్ విస్తరణ వల్ల ప్రభావితం అయ్యే ఆస్తుల సంఖ్యను తగ్గించేలా మార్గాన్ని రూపకల్పన చేశామని హెచ్ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. మెట్రో పనులకు సంబంధించి ఇంజినీరింగ్, రెవిన్యూ అధికారులతో రోజు వారీ సమీక్షలు నిర్వహిస్తున్నామని అయన అన్నారు. ముందనుకున్న అంచనా ప్రకారం 1100 ఆస్తులు ఈ విస్తరణలో కూల్చవలసి ఉంటుందని భావించామని, కానీ ఎలైన్మెంట్ ను ఇంజనీరింగ్ నవకల్పన ద్వారా సరిదిద్దటం వల్ల ఆ సంఖ్య 900 వరకు తగ్గిందని ఆయన తెలిపారు. వీటిలో ఇప్పటికే 412 ఆస్తులకు సంబంధించిన అవార్డులు జరీ చేశామని, 380 ఆస్తుల కూల్చివేతలు ఇప్పటివరకు పూర్తయ్యాయని ఆయన వెల్లడించారు. వీటి కోసం రు. 360 కోట్ల నష్టపరిహారం ప్రభావిత ఆస్తుల వారికి చెల్లించామని అన్నారు. ప్రభావిత ఆస్తులను స్వాధీనం చేసుకుంటూ, కూల్చివేతలు చేసి అవశేషాలను తొలగించడంలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని, వాటిని అధిగమించి పనులు ముమ్మరంగా చేపడుతున్నామని మెట్రో ఎండీ తెలిపారు. ఇక్కడ ఇళ్లు ఒకదానిని ఒకటి ఆనుకుని ఉండటం వల్ల, పైగా ప్రతి కట్టడానికి సంక్లిష్టమైన విద్యుత్ లైన్లు, ఇతర కేబుళ్లు వ్రేలాడుతూ ఉండడంతో వాటిని చాలా అప్రమత్తంగా తొలగిస్తూ ముందుకు వెళ్తున్నామని అన్నారు. సాధారణ జనజీవనానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అర్థరాత్రి సమయాల్లో విస్తరణ పనులు ముమ్మరంగా చేస్తున్నామని ఆయన చెప్పారు. మిగిలిన ఆస్తుల స్వాధీనానికి మరియు త్వరితగతిన కూల్చివేతలు పూర్తిచేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్టు ఆయన వెల్లడించారు. మరో వైపు మెట్రో నిర్మాణ పనులు ప్రారంభించడానికి వీలుగా చర్యలు చేపట్టామని మెట్రో ఎండీ తెలిపారు. ఈ కారిడార్ లో వచ్చే పిల్లర్ల ఏర్పాటుకు తగిన స్థలాలను గుర్తించి వాటిని మార్కింగ్ చేసే పని ప్రారంభం అయిందని ఆయన తెలిపారు. వయాడక్ట్ ను నిలిపే పిల్లర్ల మధ్య 25 మీటర్ల (సుమారు 82 అడుగులు) దూరం ఉంటుందని ఆయన చెప్పారు. మెట్రో స్తంభాలు, స్టేషన్లు వచ్చే చోట భూసామర్థ్య పరీక్షల కోసం ఏజెన్సీని నియమించామని, త్వరలో భూసామర్థ్య పరీక్షలు కూడా చేపడతామని ఆయన వెల్లడించారు. చారిత్రక మరియు ఇతర సున్నిత కట్టడాలకు అంతరాయం కలగకుండా, పిల్లర్ మరియు మెట్రో స్టేషన్ల స్థానం నిర్ణయించేందుకు డి జీ పీ ఎస్ సర్వే నిర్వహించామని ఆయన తెలిపారు.నిర్మాణసమయంలో సర్వే సులభంగా జరిగేలా భూమిపై తాత్కాలిక బెంచ్ మార్క్ (టి బి ఎం) లొకేషన్లు నిర్ణయించినట్టు ఆయన స్పష్టం చేశారు.పిల్లర్లు, స్టేషన్లు వచ్చే ప్రాంతాల్లో భూగర్భ మరుగునీటి లైన్లు, మంచినీటి లైన్లు, వరదనీటి డ్రైన్లు, పైన వేలాడే విద్యుత్ లైన్లు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశానుసారం విద్యుత్ లైన్లను అండర్ గ్రౌండ్ లేబుళ్లు గా మారుస్తామని తెలిపారు. ఇందుకోసం వాటర్ బోర్డు, జీహెచ్ఎంసీ, టీజీఎస్పీడీసీఎల్ విభాగాల నుండి వచ్చే కొద్ది రోజుల్లో అంచనాలు సమర్పించవలసిందిగా కోరామని ఆయన చెప్పారు. ఆయా శాఖల అధికారులతో మెట్రో అధికారులు రేయింబవళ్లు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షిస్తూ ముఖ్యమైన యుటిలిటీస్ ని గుర్తించే పని చేపట్టారని ఎన్ వి ఎస్ రెడ్డి తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *